భార్య హత్య కేసులో భర్త అరెస్టు

భార్య తిట్లు భరించలేక విసుగు చెంది పథకం ప్రకారం భార్యను హత్య చేశానని నిందితుడు అంగీకరించాడు. ఈ మేరకు నిందితుడని అరెస్టు చేసినట్లు కడప గ్రామీణ సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.

Updated : 28 Nov 2022 05:45 IST

వివరాలు వెల్లడిస్తున్న గ్రామీణ సీఐ అశోక్‌రెడ్డి, పక్కన ఎస్సైలు, పోలీసులు

కడప నేరవార్తలు, చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే : భార్య తిట్లు భరించలేక విసుగు చెంది పథకం ప్రకారం భార్యను హత్య చేశానని నిందితుడు అంగీకరించాడు. ఈ మేరకు నిందితుడని అరెస్టు చేసినట్లు కడప గ్రామీణ సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. ‘సీకేదిన్నె మండలం ఇందిరానగర్‌కు చెందిన నరసింహారావు, లక్ష్మీదేవికి కొన్నేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇంటర్‌ చదువుతున్న కొడుకు ఉన్నాడు. నరసింహారావు కడపలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నాడు. కొడుకు ఎదుటే భార్య భర్తను తిడుతూ, కొడుతూ ఉండేది. భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 23న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంలో నరసింహారావు భార్యను గట్టిగా తోయడంతో వంటగదిలో ఉన్న పదునైనా రాయిపై పడి లక్ష్మీదేవికి గాయాలయ్యాయి. వెంటనే ఆమె గొంతు నొక్కి, బలంగా నేలకేసి కొట్టి హత్య చేశాడు. సాక్ష్యాలను చెరిపేసి ఎవరికీ అనుమానం రాకుండా యథావిధిగా పాఠశాలకు వెళ్లాడు. లక్ష్మీదేవి విగతజీవిగా నేలపై పడి ఉండడం చూసి స్థానికులు నరసింహారావుకు సమాచారం ఇచ్చారు. తన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని అందరినీ నమ్మించాడు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని సాక్షులను విచారించగా భార్య పెట్టే వేధింపులు భరించలేక భర్తనే హత్య చేశాడని తెలిసింది. అప్పటికే నరసింహారావు పరారీలో ఉన్నాడు. పోలీసులకు దొరికితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో సీకేదిన్నె ఆర్‌ఐ ఎదుట లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు’ అని సీఐ చెప్పారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేశామన్నారు. సమావేశంలో ఎస్సైలు అరుణ్‌రెడ్డి, రాజరాజేశ్వరరెడ్డి, విష్ణు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని