అమ్మను చూడకనే.. అనంత లోకాలకు

చిన్నకారొకటి.. చోదకుడి నిర్లక్ష్యం.. రెప్పపాటులో రెండు నిండు ప్రాణాలను బలిగొంది. దీక్ష తీసుకుని నలుగురొక బృందంగా విజయవాడ అమ్మ దర్శనానికి చేస్తున్న పాదయాత్రను ఈ దుర్ఘటన విషాదాంతం చేసింది.

Updated : 04 Dec 2022 05:11 IST

భవానీలను సమీపిస్తున్న కారు...    ఢీ కొట్టిందిలా..     చెల్లాచెదురుగా భక్తులు

తుని పట్టణం, న్యూస్‌టుడే: చిన్నకారొకటి.. చోదకుడి నిర్లక్ష్యం.. రెప్పపాటులో రెండు నిండు ప్రాణాలను బలిగొంది. దీక్ష తీసుకుని నలుగురొక బృందంగా విజయవాడ అమ్మ దర్శనానికి చేస్తున్న పాదయాత్రను ఈ దుర్ఘటన విషాదాంతం చేసింది. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


ఇద్దరు భవానీ భక్తుల దుర్మరణం

నుజ్జయిన కారు ముందు భాగం

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం పెనసాం గ్రామానికి చెందిన భవానీలు రావి సంతోష్‌ (28), నల్ల ఈశ్వరరావు (38), మహేష్‌, జి.గిరి స్వగ్రామం నుంచి విజయవాడకు కాలినడకన గత నెల 26న మధ్యాహ్నం బయల్దేరారు. వారు శుక్రవారం రాత్రి తుని జాతీయ రహదారి సమీపాన పాయకరావుపేట వద్ద అమ్మవారి ఆలయంలో బస చేశారు. శనివారం ఉదయం 6 గంటలకు పూజ చేసుకుని యాత్రను కొనసాగించారు. డీమార్ట్‌ దాటాక ఒక డాబా వద్దకు చేరుకునే సరికి సుమారు 6.30 గంటల సమయంలో మృత్యువులా చిన్నకారు వెనుక నుంచి దూసుకువచ్చింది. ముందు ఇద్దరు.. వెనుక ఇద్దరు రోడ్డుకు బాగా పక్కగా వారు నడచి వెళుతుండగా, విశాఖపట్నం నుంచి అనపర్తి మండలం కొమరిపాలెం వెళ్తున్న కారు అతి వేగంగా వీరిపైకి దూసుకొచ్చింది. కుడివైపు టాటామ్యాజిక్‌ వాహనం వెళ్తుండగా దాన్ని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో అతివేగంగా వచ్చి అదుపుతప్పి సంతోష్‌, ఈశ్వరరావులను ఢీకొట్టింది. వారిద్దరూ  అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మిగతా ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. తమతో నడుచుకుంటూ వచ్చిన వారిలో ఇద్దరు ఎక్కడపడ్డారో.. ఏం జరిగిందో అర్థంకాక ఈ ఇద్దరూ బోరున విలపించారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. కారు డ్రైవర్‌ సూర్యతేజను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌ఛార్జి సీఐ సన్యాసిరావు తెలిపారు.  


పెనసాంలో విషాద ఛాయలు

శ్రీకాకుళంలో బయలుదేరిన  సంతోష్‌, ఈశ్వరరావు (పాతచిత్రం)

జి.సిగడాం: జి.సిగడాం మండలం పెనసాం గ్రామానికి చెందిన ఇద్దరు భవానీ భక్తులు దుర్మరణం పాలవ్వడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రావి సంతోష్‌ 2019లో సంధ్య అనే యువతిని వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేదు. తల్లిదండ్రులు, సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. వ్యవసాయమే ఆధారం.

* నల్ల ఈశ్వరరావుకు భార్య నీలవేణి, తల్లిదండ్రులు, అన్నయ్య కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఈశ్వరరావుకు ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె ఉన్నారు. విద్యుత్‌ పనులు చేస్తూ తమను పోషిస్తున్నాడని, ఇప్పుడు ఎవరు దిక్కు అని ఈ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని