నగదు ఇవ్వమన్నందుకే సుబ్బారావు హత్య

సీతారామపురం ఏపీ ఆదర్శ పాఠశాల సమీపంలో గత నెల 27న ఆంబోరు సుబ్బారావు హత్య అనంతరం ఆయన మృతదేహాన్ని దహనం చేసిన కేసులో నిందితురాలు మెహరున్నీసాను అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.

Updated : 05 Dec 2022 04:00 IST

నిందితురాలిని అరెస్టు చేసి వివరాలు వెల్లడించిన డీఎస్పీ

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటరమణ

ఉదయగిరి, న్యూస్‌టుడే:  సీతారామపురం ఏపీ ఆదర్శ పాఠశాల సమీపంలో గత నెల 27న ఆంబోరు సుబ్బారావు హత్య అనంతరం ఆయన మృతదేహాన్ని దహనం చేసిన కేసులో నిందితురాలు మెహరున్నీసాను అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం సీఐ గిరిబాబు, ఎస్సై కిషోర్‌బాబుతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. వైఎస్సార్‌ జిల్లా పోరుమామిళ్లకు చెందిన అక్బర్‌తో 17 ఏళ్ల క్రితం సీతారామపురంనకు చెందిన మెహరున్నీసాకు పెళ్లి అయింది. వీరికి ఇద్దరు సంతానం.  అక్బర్‌ కూరగాయల మార్కెట్‌లో కూలీ. మెహరున్నీసా చీరల వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూరగాయల వ్యాపారి వైఎస్సార్‌ జిల్లా కాశినాయన మండలం, కొండ్రాజుపల్లికి చెందిన ఆంబోరు సుబ్బారావుతో అక్బర్‌కు పరిచయమైంది. ఈ క్రమంలో సుబ్బారావుతో మెహరున్నీసాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. సీతారామపురం ఆదర్శ పాఠశాల సమీపంలో ఆమెకు సుబ్బారావు ఇల్లు కట్టించాడు. మద్యం అలవాటున్న అక్బర్‌కు విషయం తెలియడంతో ఆమె భర్తను అంతమొందించాలని సుబ్బారావుకు లక్ష రూపాయలు ఇచ్చింది. అప్పటి నుంచి అక్బర్‌ కనిపించకుండా పోయారు. అనంతరం మెహరున్నీసా చీరల వ్యాపారంతోపాటు, అప్పులు తీర్చుకొనేందుకు సుబ్బారావు నుంచి రూ.4.50 లక్షల నగదు తీసుకున్నారు. తిరిగి చెల్లించాలని ఆమెను తరచూ వేధిస్తున్నారు. గత నెల 26న సుబ్బారావు పోరుమామిళ్లలో ఉండగా మెహరున్నీసా వెళ్లి గొడవపడ్డారు. అనంతరం ఇద్దరూ కలిసి స్కూటీపై సీతారామపురం చేరుకున్నారు. ఈనేపథ్యంలో సుబ్బారావును అంతమొందించాలని నిర్ణయించుకుని మద్యంలో నిద్ర మాత్రలు కలిపి తాగించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సుబ్బారావును రోడ్డుపైకి లాక్కొచ్చి తలను నేలకేసి కొట్టి హతమార్చారు. మృతిచెందినట్లు నిర్ధరించుకొని స్కూటీపై చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మృతుడి వద్ద ఉన్న రూ.37 వేలు తీసుకొని పారిపోయారు.  విచారణలో మెహరున్నీసా హత్య చేసినట్లు తేలడంతో అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసును ఛేదించిన సీఐ గిరిబాబు, సీతారామపురం ఎస్సై కిషోర్‌బాబులను అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని