పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య

జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. జామికి చెందిన అల్లంకి సురేష్‌(30) కుమరాం వద్ద ఓ టైలరు దుకాణంలో పని చేస్తున్నాడు.

Updated : 06 Dec 2022 04:38 IST

సురేష్‌ (పాతచిత్రం)

జామి, న్యూస్‌టుడే: జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. జామికి చెందిన అల్లంకి సురేష్‌(30) కుమరాం వద్ద ఓ టైలరు దుకాణంలో పని చేస్తున్నాడు. గతంలో విద్యా వాలంటీరుగా పనిచేసి మానేశాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శనివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో రెండు రోజులపాటు చుట్టుపక్కల వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. ఈక్రమంలో భీమునిపట్నం బీచ్‌లో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సోమవారం సమాచారం అందడంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. సురేష్‌ తండ్రి భాస్కరరావు చనిపోగా.. తల్లి రమణమ్మ, భార్య ఝాన్సీ, ఇద్దరు చిన్నపిల్లలకు ఇతనే ఆధారం. పెద్దదిక్కు లేకపోవడంతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విశాఖ కేజీహెచ్‌లో శవపరీక్ష నిర్వహించాక మృతదేహాన్ని జామి తీసుకొచ్చారు.

మనస్తాపానికి గురై వివాహిత..

పాలకొండ, గ్రామీణం, న్యూస్‌టుడే: మనస్తాపంతో ఓ వివాహిత ప్రాణాలు తీసుకున్న ఘటన పాలకొండ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఇందిరానగర్‌కాలనీకి చెందిన మహిళకు(32)కు తన భర్త శివతో కొన్నేళ్లుగా మనస్పర్థలున్నాయి. వీరికి 15 ఏళ్ల వయసుగల కుమార్తె ఉంది. కొన్నాళ్ల క్రితం భర్త నుంచి విడిపోయిన ఆమె వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని ఓ పాఠశాలలో  చదువుతున్న కుమార్తెను చూసేందుకు ఆదివారం ఆమె సిద్ధమైంది. ఈక్రమంలో ప్రియుడు వద్దని చెప్పడంతో గొడవ జరిగింది. దీంతో ఆరోజు రాత్రి ఇంట్లో పంకాకు ఉరేసుకుని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు స్పందించి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై శివప్రసాద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని