Adilabad: కలహాల కార్చిచ్చులో కాలిపోయిన తల్లీబిడ్డలు

వివాహమై ఏడేళ్లే అయింది. అత్తింటి వారితో చిన్నచిన్న సమస్యలు, మనస్పర్థలున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగిందో ఏమో ఆ ఇల్లాలు క్షణికావేశంలో తీవ్ర నిర్ణయమే తీసుకుంది. చనిపోవాలని నిర్ణయించుకుంది.

Updated : 30 Dec 2022 07:10 IST

క్షణికావేశంలో కుమార్తెలతో కలిసి నిప్పంటించుకున్న ఇల్లాలు
ముగ్గురూ మృతి.. ఇచ్చోడలో విషాదం

ఇచ్చోడ, న్యూస్‌టుడే: వివాహమై ఏడేళ్లే అయింది. అత్తింటి వారితో చిన్నచిన్న సమస్యలు, మనస్పర్థలున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగిందో ఏమో ఆ ఇల్లాలు క్షణికావేశంలో తీవ్ర నిర్ణయమే తీసుకుంది. చనిపోవాలని నిర్ణయించుకుంది. విషాదం ఏమిటంటే తాను మరణిస్తూ..అభంశుభం ఎరుగని ఐదేళ్లు కూడా నిండని బిడ్డలనూ వెంట తీసుకెళ్లింది. ఈ దారుణ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలో గురువారం చోటుచేసుకుంది.

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. బజార్‌హత్నూర్‌ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన వేదశ్రీ(23)కి, ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్‌తో 2015లో వివాహమైంది. ప్రశాంత్‌ ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. దంపతులకు కుమార్తెలు ప్రజ్ఞ(5), వెన్నెల(3) సంతానం. ఇచ్చోడలో అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు. భర్త ఉద్యోగానికి వెళ్లగా, ఇంట్లోనే ఉన్న వేదశ్రీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కుమార్తెలను వెంటబెట్టుకుని వంట గదిలోకి వెళ్లింది. పిల్లలతోపాటు తనపైనా పెట్రోల్‌ చల్లుకుని నిప్పంటించుకుంది. ఇంటి లోపలి నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి తలుపులు పగలగొట్టారు. తల్లీబిడ్డలకు అంటుకున్న మంటలను ఆర్పారు. అప్పటికే వేదశ్రీ మృతి చెందగా, కొనఊపిరితో ఉన్న చిన్నారులను రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ తొలుత ప్రజ్ఞ, రెండు గంటల తర్వాత వెన్నెల మరణించారు. వేదశ్రీకి, అత్తింటి వారికి మధ్య మనస్పర్థలున్నట్టు, ఈ క్రమంలోనే వేరుకాపురం పెట్టినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని