Smita Sabharwal: స్మితా సభర్వాల్‌ ఇంట్లోకి చొరబాటుపై పోలీసుల నజర్‌

ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిణి, సీనియర్‌ ఐఏఎస్‌ స్మితా సభర్వాల్‌ ఇంట్లోకి ఒక వ్యక్తి అర్ధరాత్రి చొరబడిన వ్యవహారంపై పోలీసు నిఘా వర్గాలు నిశితంగా దర్యాప్తు చేస్తున్నాయి.

Updated : 23 Jan 2023 07:46 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిణి, సీనియర్‌ ఐఏఎస్‌ స్మితా సభర్వాల్‌ ఇంట్లోకి ఒక వ్యక్తి అర్ధరాత్రి చొరబడిన వ్యవహారంపై పోలీసు నిఘా వర్గాలు నిశితంగా దర్యాప్తు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్‌ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ సమీపంలోని ప్లజెంట్‌ వ్యాలీ బి-11లో ఆమె నివసిస్తున్నారు. ఇక్కడే నగర పోలీసు కమిషనర్‌ సహా పలువురు ఉన్నతాధికారులు నివసిస్తుండడంతో నిరంతరం పూర్తిస్థాయి భద్రత ఉంటుంది. మేడ్చల్‌ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న చెరుకు ఆనంద్‌కుమార్‌రెడ్డి (48), అతడి స్నేహితుడైన హోటల్‌ నిర్వాహకుడు కొత్త బాబుతో కలిసి కారులో ఈ నెల 19న రాత్రి 11.40 గంటల ప్రాంతంలో ప్లజెంట్‌వ్యాలీ వద్దకు వచ్చారు.

బి-17కు వెళ్లాలంటూ సెక్యూరిటీ గేటు వద్ద సిబ్బందికి చెప్పి, నేరుగా స్మితా సభర్వాల్‌ నివాసం (బి-11) వద్దకు చేరుకున్నారు. బాబు కారులో ఉండగా, ఆనంద్‌కుమార్‌రెడ్డి ఆమె ఇంటి మొదటి అంతస్తులోకి వెళ్లి తలుపు తట్టాడు. నివ్వెరపోయిన ఆమె వెంటనే డయల్‌ 100కు సమాచారం ఇచ్చారు. ఈలోగా భద్రతా సిబ్బంది ఆనంద్‌కుమార్‌రెడ్డిని పట్టుకున్నారు. కాసేపటికి జూబ్లీహిల్స్‌ పోలీసులొచ్చి ఆనంద్‌ను, కారులో ఉన్న బాబును అదుపులోకి తీసుకొన్నారు. వారిపై ఐపీసీ సెక్షన్‌ 458, రెడ్‌ విత్‌ 34 కింద కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. స్మితా సభర్వాల్‌ ఇంట్లోకి ప్రవేశించే ముందు.. రాత్రి 11.34 నిమిషాలకు ‘మీ ఇంటి గుమ్మం వద్ద ఉన్నా’ అంటూ ఆమెకు ఆనంద్‌ ట్వీట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

2018లో డీటీగా పోస్టింగ్‌..

ఆనంద్‌కుమార్‌రెడ్డి గతంలో చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగంతో పాటు పాత్రికేయుడిగా పనిచేసినట్లు గుర్తించారు. గ్రూపు-2లో ఎంపికై 2018లో హైదరాబాద్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై పౌరసరఫరాల విభాగంలో పనిచేస్తున్నారు. శామీర్‌పేటలోని అలియాబాద్‌లో ఆనంద్‌కుమార్‌రెడ్డి, బాబు ఒకే భవనంలో కింద, పైన అంతస్తుల్లో నివసిస్తున్నారు.


అధికారిణికీ భద్రత లేని ప్రభుత్వమిది: రేవంత్‌ రెడ్డి రీట్వీట్‌

స్మితా సభర్వాల్‌ చేసిన ట్వీట్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు.. ‘కేసీఆర్‌ పాలనలో మినిమమ్‌ గవర్నెన్స్‌.. మ్యాగ్జిమం పాలిటిక్స్‌ ఫలితం ఇది. సింగరేణి కాలనీలో ఆరేళ్ల పసిబిడ్డకే కాదు.. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారిణికి కూడా భద్రత లేని పాలనలో ఉన్నాం. ఆడబిడ్డలూ.. తస్మాత్‌ జాగ్రత్త’ అంటూ తెలంగాణ సీఎంవో, హైదరాబాద్‌ పోలీస్‌, తెలంగాణ డీజీపీలకు ట్యాగ్‌ చేస్తూ రీట్వీట్‌్ చేశారు.  


బాధాకరమైన సంఘటన: స్మిత

‘ఇది అత్యంత బాధాకరమైన సంఘటన. రాత్రివేళ ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు. నేను సమయస్ఫూర్తితో వ్యవహరించి నా ప్రాణాన్ని కాపాడుకున్నా. ఎంత భద్రత నడుమ ఉన్నాం అనుకున్నా.. ఇంటి తలుపులు, తాళాలను స్వయంగా తనిఖీ చేసుకోవాలి..అత్యవసరమైతే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని పాఠం నేర్చుకున్నా’అని స్మితా సభర్వాల్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని