Kamareddy: 14 ఏళ్ల కవల కుమార్తెలను విక్రయించిన తండ్రి, సవతి తల్లి

చిన్ననాడే తల్లిని కోల్పోయిన ఆడ కవలలు వారు. కష్టాలు.. కన్నీళ్లే తోడుగా పెరిగారు. వారికి పద్నాలుగేళ్ల వయసు రాగానే కన్న తండ్రి, సవతి తల్లి వారిద్దరినీ వేర్వేరుగా అమ్మేశారు.

Updated : 25 Jan 2023 11:09 IST

పెళ్లి చేసుకొని చిత్రహింసలు పెట్టిన భర్తలు

ఏడుగురిపై పోక్సో కేసు నమోదు

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే : చిన్ననాడే తల్లిని కోల్పోయిన ఆడ కవలలు వారు. కష్టాలు.. కన్నీళ్లే తోడుగా పెరిగారు. వారికి పద్నాలుగేళ్ల వయసు రాగానే కన్న తండ్రి, సవతి తల్లి వారిద్దరినీ వేర్వేరుగా అమ్మేశారు. కొనుగోలు చేసిన వారు ఆ బాలికలను పెళ్లి చేసుకుని.. నరకం చూపించడం మొదలుపెట్టారు. భర్త చెర నుంచి తప్పించుకున్న ఓ అమ్మాయి అధికారులను ఆశ్రయించింది. తన సోదరిని కూడా ఇలాగే అమ్మేశారని చెప్పింది. దీంతో వారిని పెళ్లి చేసుకున్నవారితో సహా ఏడుగురు నిందితులను పోలీసులు రిమాండుకు తరలించారు. ఈ అమానవీయ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ మారుమూల గ్రామంలో చోటుచేసుకుంది.

జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. మాచారెడ్డి మండలానికి చెందిన ఆడ కవల పిల్లలు రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు. తండ్రి రెండో పెళ్లి చేసుకోగా వారికి ఓ కుమారుడు, కుమార్తె జన్మించారు. నలుగురు పిల్లలను పోషించడం కష్టమని భావించిన తండ్రి బాలికల(14)ను విక్రయించాలనుకున్నాడు. ఈ విషయాన్ని తనకు తెలిసిన బంధువుకు చెప్పగా అతడు రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తిని పరిచయం చేశాడు. ఆయన మరో వ్యక్తితో కలిసి మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంలోని దండుపల్లికి చెందిన శర్మన్‌ను తీసుకొచ్చారు. కవలల్లో చిన్న అమ్మాయిని రూ.80 వేలకు కొనుక్కున్నారు. గత ఏడాది సెప్టెంబరులో ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లిన శర్మన్‌ అక్కడే పెళ్లి చేసుకున్నాడు. అనంతరం స్వగ్రామం దండుపల్లికి తీసుకెళ్లి బాలికను శారీరకంగా అనుభవిస్తూ నరకం చూపించసాగాడు.

అతడికి అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉండడంతో పాటు అనేక మందితో వివాహేతర సంబంధాలున్నాయి. బాలిక అక్కడి నుంచి పారిపోయి కామారెడ్డికి చేరుకొని బాలల సంరక్షణాధికారిణి(డీసీపీవో) స్రవంతిని కలిసింది. తన మాదిరే సోదరిని కూడా సికింద్రాబాద్‌లోని బోయినపల్లికి చెందిన కృష్ణకుమార్‌కు గత ఏడాది డిసెంబరులో రూ.50 వేలకు అమ్మేశారని.. అక్కను పెళ్లిచేసుకొని ఇబ్బందిపెడుతున్నాడని వాపోయింది. డీసీపీవో ఫిర్యాదు మేరకు పోలీసులు బాలికల తండ్రి, సవతి తల్లి, పిల్లలను వివాహం చేసుకున్న శర్మన్‌, కృష్ణకుమార్‌తో పాటు అమ్మకానికి మధ్యవర్తులుగా వ్యవహరించిన కాల రాంబాటి, రమేశ్‌, మహేందర్‌తో కలిపి మొత్తం ఏడుగురిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని