తుపాకీ పేల్చి.. దాడి చేసి..

హైదరాబాద్‌ శివారులో దోపిడీ దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు. గుర్తుతెలియని ముగ్గురు దుండగులు మద్యం దుకాణ సిబ్బందిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపి.. ఆపై దాడి చేసి రూ.2.08 లక్షలు దోపిడీ చేశారు.

Updated : 25 Jan 2023 06:07 IST

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో దొంగల హల్‌చల్‌
మద్యం దుకాణ సిబ్బంది దగ్గర రూ.2.08 లక్షల దోపిడీ

శామీర్‌పేట, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ శివారులో దోపిడీ దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు. గుర్తుతెలియని ముగ్గురు దుండగులు మద్యం దుకాణ సిబ్బందిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపి.. ఆపై దాడి చేసి రూ.2.08 లక్షలు దోపిడీ చేశారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..ఉద్దెమర్రి గ్రామంలో సామల ముత్యంరెడ్డి మద్యం దుకాణంలో క్యాషియర్‌గా బాలకిషన్‌... అతని సహాయకునిగా మర్రి జైపాల్‌రెడ్డి పనిచేస్తున్నారు. రోజు మాదిరి సోమవారం రాత్రి 10 గంటలకు దుకాణం షెట్టర్‌ మూసేసి లోపల డబ్బులు లెక్కించారు. రూ.2.08 లక్షల్ని బ్యాగులో వేసుకుని జైపాల్‌రెడ్డి ద్విచక్రవాహనం వద్దకు వెళ్లి నిల్చున్నాడు. దుకాణానికి బాలకిషన్‌ తాళం వేస్తున్న సమయంలో ముఖానికి ముసుగులు ధరించిన 25-30 ఏళ్ల లోపు ఉన్న ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు. బెదిరిస్తూ కర్రలతో ఒక్కసారిగా జైపాల్‌రెడ్డిపై దాడి చేశారు. పక్కనే ఉన్న బాలకిషన్‌ అడ్డుకొని కర్ర లాక్కొని దొంగలపై తిరగబడ్డారు. ఇంతలోనే ముగ్గురిలో ఓ వ్యక్తి దేశవాళీ తుపాకీ తీసి బాలకిషన్‌ వైపు గురిపెట్టి కాల్చాడు. అతడు తప్పించుకోవడంతో తూటా మద్యం దుకాణం షెట్టరుకు తగిలింది. తుపాకీ గురిపెట్టి జైపాల్‌రెడ్డి వద్ద ఉన్న నగదు లాక్కొని రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఉద్దెమర్రి-మూడుచింతలపల్లి రహదారి మీదుగా పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దోపిడీ చేసిన అనంతరం నిందితులు ఉద్దెమర్రి నుంచి బొమ్మలరామారం వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆరు బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజీలను శోధిస్తున్నారు. పక్కా రెక్కీ చేసి సొత్తు లాక్కెళ్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నంబరు ప్లేటు లేని వాహనంపై వచ్చినట్లు బాధితులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని