సిలిండర్‌ పేలి.. ఇద్దరి సజీవదహనం

వృద్ధాప్య పింఛను తీసుకోవడానికి స్వగ్రామానికి వచ్చిన మహిళ, ఆమె మనవరాలు గ్యాస్‌ సిలిండర్‌ పేలి సజీవదహనమయ్యారు.

Published : 26 Jan 2023 04:45 IST

చేగుంట, న్యూస్‌టుడే: వృద్ధాప్య పింఛను తీసుకోవడానికి స్వగ్రామానికి వచ్చిన మహిళ, ఆమె మనవరాలు గ్యాస్‌ సిలిండర్‌ పేలి సజీవదహనమయ్యారు. మెదక్‌ జిల్లా చేగుంట మండలం చిన్నశివునూరులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. చిన్నశివునూరుకు చెందిన పిట్లల రాజ్‌ఖన్నా, లక్ష్మి దంపతులకు కుమార్తెలు మధుమతి (7), వెన్నెల, కుమారుడు శ్రీకాంత్‌ ఉన్నారు. ఉపాధి నిమిత్తం యాదాద్రి జిల్లా రాజాపేట మండలం వెంకటాపూర్‌కు వలస వెళ్లారు. వారితో పాటే రాజ్‌ఖన్నా తల్లి అంజమ్మ (60) సైతం వెళ్లింది. అంజమ్మ పింఛను కోసం  మనవరాలు మధుమతిని తీసుకొని చిన్నశివునూరుకు వచ్చారు. ఇంట్లో విద్యుత్తు సరఫరా లేకపోవడంతో చుట్టుపక్కల వారి ఇళ్లల్లో ఉండి వచ్చారు. తర్వాత ఇంట్లోకి వెళ్లి నిద్రించారు. అర్ధరాత్రి భారీ శబ్ధం రావడంతో స్థానికులు లేచి చూసేసరికి అంజమ్మ ఇంట్లో నుంచి మంటలు వస్తున్నాయి. రామాయంపేట అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. లోపలికి వెళ్లి చూడగా మంచంపై నిద్రించిన నాయనమ్మ, మనవరాలు సజీవదహనమై కనిపించారు. పక్కనే పేలిన గ్యాస్‌ సిలిండర్‌ ఉంది. వంట చేసుకున్నాక సిలిండర్‌ ఆపకపోవడం వల్లగాని, బీడీ అలవాటున్న అంజమ్మ అగ్గిపెట్టె వెలిగించడం వల్ల గాని ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు వారిని పరామర్శించారు. కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని