నూర్పిడి యంత్రంలో పడి మహిళ దుర్మరణం

పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు వేరుశనగ నూర్పిడి యంత్రంలో పడి దుర్మరణం పాలయ్యారు.

Published : 26 Jan 2023 04:45 IST

వేర్వేరుగా తెగిపడిన తల, మొండెం

కోడేరు, న్యూస్‌టుడే: పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు వేరుశనగ నూర్పిడి యంత్రంలో పడి దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరులో జరిగింది. పోలీసులు, ప్రత్యేక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు.. మండలంలోని తీగలపల్లికి చెందిన సాంబశివుడికి వేరుశనగ నూర్పిడి యంత్రం ఉంది. అదే గ్రామానికి చెందిన గొల్ల గంగమ్మ(36)తో పాటు తోటి కూలీలతో యంత్రం యజమాని వేరుశనగ నూర్పిడికి తీసుకెళ్లారు. జనుంపల్లికి చెందిన ఓ రైతుకు కోడేరు శివారులో ఉన్న ఎకరా పొలంలో పంట నూర్పిడి చేసేందుకు బుధవారం వెళ్లారు. పనులు చేస్తుండగా ట్రాక్టర్‌కు అమర్చిన కంప్రెషర్‌ రాడ్‌, నూర్పిడి యంత్రం జాయింట్‌ మధ్యలో పడి ఉన్న వేరుశనగ కట్టెను తీసేందుకు గంగమ్మ వెళ్లారు. ముఖానికి కట్టుకున్న ముసుగు రాడ్‌కు చుట్టుకోవడంతో మొండెం నుంచి తల పూర్తిగా తెగిపడిపోయింది. తోటి కూలీలు వచ్చి చూసేసరికే మొండెం కొట్టుకుంటూ రక్తపుమడుగులో కనిపించింది. ఎస్సై నరేందర్‌రెడ్డి ఘటనాస్థలికి వచ్చి పంచనామా చేశారు. గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపూర్‌కు చెందిన శ్రీనుతో గంగమ్మకు 20 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి కొడుకు ఉన్నాడు. భర్తతో మనస్పర్థలు వచ్చి ఏడాదిన్నర నుంచి పుట్టింట్లో ఉంటూ కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా ఈమె కుమారుడు తండ్రి వద్దే ఉంటున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని