Andhra News: కుమార్తె వరసయ్యే బాలికపై అత్యాచారం, హత్య.. కామాంధుడికి ఉరిశిక్ష

కుమార్తె వరుసయ్యే ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన ఉన్మాదికి ఉరిశిక్ష పడింది. ఒంగోలు రెండో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి, పోక్సో కోర్టు న్యాయమూర్తి (ఇన్‌ఛార్జి) ఎం.ఎ.సోమశేఖర్‌ ఈ మేరకు తీర్పునిచ్చారు.

Updated : 26 Jan 2023 08:49 IST

ఒంగోలు న్యాయవిభాగం, నేరవిభాగం- న్యూస్‌టుడే: కుమార్తె వరుసయ్యే ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన ఉన్మాదికి ఉరిశిక్ష పడింది. ఒంగోలు రెండో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి, పోక్సో కోర్టు న్యాయమూర్తి (ఇన్‌ఛార్జి) ఎం.ఎ.సోమశేఖర్‌ ఈ మేరకు తీర్పునిచ్చారు. స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.వి.రామేశ్వరరెడ్డి కథనం ప్రకారం... గిద్దలూరు మండలం అంబవరానికి చెందిన దూదేకుల సిద్దయ్య మద్యానికి బానిస. అతడితో వేగలేక భార్య దూరంగా ఉంటున్నారు. 2021 జులై 8న... ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారిని పిలిచి, లోపలికి తీసుకెళ్లిన సిద్ధయ్య అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో... ముఖాన్ని మంచం కోడుకేసి కొట్టాడు. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన చిన్నారిపై అత్యాచారం చేశాడు. కాసేపటికి ఆమె చనిపోవడంతో మృతదేహాన్ని ప్లాస్టిక్‌ గోతంలో మూట కట్టి, సైకిల్‌పై పెట్టుకుని, ఊరి శివారులోని చిల్లచెట్లలో పడేసి పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... నిందితుడిని అరెస్టు చేశారు. కేసు విచారణలో సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి... నేరం రుజువు కావడంతో నిందితుడికి మరణశిక్ష(చనిపోయేంత వరకు ఉరి) విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. బాలిక తల్లిదండ్రులకు రూ.10 లక్షలు పరిహారం అందించాలని ప్రభుత్వానికి సూచించారు. తీర్పు నేపథ్యంలో జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ సమావేశం నిర్వహించారు. కేసు విచారణలో ప్రతిభ కనబరిచిన అప్పటి దిశ స్టేషన్‌ డీఎస్పీ ధనుంజయుడు, సీఐ ఎండీ ఫిరోజ్‌, కోర్టు లైజన్‌ సిబ్బందిని అభినందించారు. ప్రశంస పత్రాలతో పాటు రివార్డులు అందించారు. పక్కా సాక్ష్యాధారాలతో ఛార్జిషీటు దాఖలు చేసినందునే 18 నెలల్లోనే దోషికి శిక్ష పడినట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు