ఏపీలో తయారీ... కర్ణాటకలో చలామణి

కర్ణాటక, ఆంధప్రదేశ్‌లలో కలకలం రేపిన నకిలీ నోట్ల తయారీ కేసులో పట్టుబడిన నిందితులు.. అనంతపురంలోనే వాటిని తయారు చేస్తున్నట్లు అంగీకరించారని బెంగళూరు పశ్చిమ విభాగం అదనపు పోలీసు కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ వెల్లడించారు.

Published : 26 Jan 2023 05:06 IST

వైకాపా నాయకురాలు రజని కీలక నిందితురాలిగా ఉన్న నకిలీ నోట్ల కేసు వ్యవహారం
అనంతపురం, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో   ముద్రణ

ఈనాడు- అమరావతి, బెంగళూరు, న్యూస్‌టుడే- బెంగళూరు (మల్లేశ్వరం): కర్ణాటక, ఆంధప్రదేశ్‌లలో కలకలం రేపిన నకిలీ నోట్ల తయారీ కేసులో పట్టుబడిన నిందితులు.. అనంతపురంలోనే వాటిని తయారు చేస్తున్నట్లు అంగీకరించారని బెంగళూరు పశ్చిమ విభాగం అదనపు పోలీసు కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ వెల్లడించారు. చరణ్‌సింగ్‌, రజని, గోపీనాథ్‌, పుల్లలరేవు రాజాలను నిందితులుగా గుర్తించి, అరెస్టు చేసినట్లు చెప్పారు. ప్రొద్దుటూరుకు చెందిన వైకాపా నాయకురాలు, ఏపీ బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రాజపుత్ర రజని (38) నిందితురాలిగా ఉన్న నకిలీ నోట్ల కేసులో బెంగళూరు పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో వైకాపా నాయకురాలు రజని, ప్రొద్దుటూరుకు చెందిన చరణ్‌సింగ్‌ను రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్న బెంగళూరులోని సుబ్రహ్మణ్యపుర పోలీసులు... వారిని వైయస్‌ఆర్‌, అనంతపురం జిల్లాలకు తీసుకొచ్చి నకిలీ నోట్ల ముద్రణ కేంద్రాలు, భద్రపరిచే స్థావరాల్లో దాడులు నిర్వహించారు. రూ.11 లక్షల నకిలీ నోట్లు, వాటిని ముద్రించేందుకు ఉపయోగించే యంత్రాలు, పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాతో సంబంధాలున్న గోపీనాథ్‌, రాజా అనే మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.

ఏపీలో నాయకుల అండదండలు!

బెంగళూరులోని ఉత్తరాహళ్లి-కెంగేరి ప్రధాన రహదారిలో పూర్ణప్రజ్ఞా లే అవుట్‌ సాధనా కళాశాల వద్ద బొలెరో వాహనంలో నకిలీ నోట్ల కట్టలు పెట్టుకుని.. వాటిని మార్చుతూ రజని అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. ఆమె వద్దనున్న రూ.4.09 లక్షల విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రజని వైకాపా నాయకురాలు కావటం, ముఖ్య నాయకులతో సంబంధం ఉన్న నేపథ్యంలో ఆమె ఫోన్‌ను విశ్లేషించినప్పుడు కొన్ని ఆధారాలు లభించినట్లు సమాచారం. వైయస్‌ఆర్‌, అనంతపురం జిల్లాలకు చెందిన మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ఇప్పటికే కొంత సమాచారం సేకరించారు. వారిని త్వరలో విచారణకు పిలిపించే అవకాశం ఉంది.

నకిలీ నోట్ల తయారీలో ‘రాజా’!

ప్రొద్దుటూరుకు చెందిన చరణ్‌సింగ్‌, రజని కలిసి అనంతపురం, చిక్కబళ్లాపురాలకు చెందిన బృందాల నుంచి నకిలీ నోట్లను సేకరించేవారని దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న అనంతపుర¢ం వాసి పుల్లలరేవు రాజా నకిలీ నోట్ల తయారీలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నాడని పోలీసు అధికారి సందీప్‌ పాటిల్‌ వివరించారు. రాజాకు సాంకేతిక సహకారం అందిస్తున్న గోపీనాథ్‌ అనే వ్యక్తి గురించీ వివరాలు రాబడుతున్నారు.


వైకాపా నుంచి రజని సస్పెన్షన్‌

కడప, నేరవార్తలు, న్యూస్‌టుడే: నకిలీ నోట్ల కేసులో నిందితురాలైన రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రజనిని వైకాపా నుంచి సస్పెండు చేస్తూ అధిష్ఠానానికి నివేదిక పంపినట్లు ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. రజనిపై కేసు నమోదవడంతో ఆమెపై నివేదిక పంపాలని పార్టీ నుంచి సమాచారం వచ్చిందని తెలిపారు. దీంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండు చేయాలని నివేదిక పంపానని వివరించారు. వెంటనే పార్టీ చర్యలు తీసుకుందని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని