నిజామాబాద్‌ పశు గణాభివృద్ధి ఏడీ బలవన్మరణం

నిజామాబాద్‌ పశు గణాభివృద్ధి సహాయ సంచాలకుడు(ఏడీ) శ్రీశైలం (42) జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు.

Published : 27 Jan 2023 03:55 IST

అనారోగ్యం, కుటుంబ కలహాలే కారణం!

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే:  నిజామాబాద్‌ పశు గణాభివృద్ధి సహాయ సంచాలకుడు(ఏడీ) శ్రీశైలం (42) జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నిజామాబాద్‌ ఆరో ఠాణా ఎస్సై సాయికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కేంద్రానికి చెందిన పెద్దకాసుల శ్రీశైలం గతేడాది వరంగల్‌ నుంచి నిజామాబాద్‌కు పశు గణాభివృద్ధి విభాగం ఏడీగా బదిలీపై వచ్చారు. విధుల్లో భాగంగా గత బుధవారం (25న) కామారెడ్డికి వెళ్లొచ్చిన ఆయన సారంగాపూర్‌లోని తన కార్యాలయంలో సిబ్బందితో కలిసి గణతంత్ర వేడుకలకు సంబంధించిన పనులు చూసుకున్నారు. అనంతరం బుధవారం రాత్రి కాపలాదారుడు మినహా సిబ్బంది కార్యాలయం నుంచి ఇళ్లకు వెళ్లిపోగా.. శ్రీశైలం మాత్రం అక్కడే ఉన్నారు. ఆ సమయంలో ఆయన కుటుంబీకులతో సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. తాను జీవితంపై విరక్తి చెందానని, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని కుమారుడు రవితేజకు చెప్పారు. అనుమానం వచ్చిన కుమారుడు హనుమకొండ నుంచి నిజామాబాద్‌కు బయలుదేరారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో కార్యాలయానికి చేరుకుని తలుపులు ధ్వంసం చేసి చూడగా.. అప్పటికే ఉరేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. కుమారుడి సమాచారంతో పోలీసులు ఏడీ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనారోగ్యం, కుటుంబ కలహాలే ఏడీ ఆత్మహత్యకు కారణమని తెలుస్తోందని ఎస్సై సాయికుమార్‌ తెలిపారు. ఘటన స్థలం నుంచి సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకొన్నామని, తన చావుకు ఎవరూ బాధ్యులు కాదు అని అందులో రాసి ఉందని ఎస్సై పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని