మద్యం మత్తులో దారుణం

మద్యం మత్తులో కట్టుకున్న భార్యను, పిల్లనిచ్చిన అత్తను వేటకొడవలితో ఓ వ్యక్తి అతి కిరాతకంగా నరికి చంపిన సంఘటన కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం జాలవాడిలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Updated : 28 Jan 2023 06:12 IST

ఏపీలో వేట కొడవలితో భార్య, అత్తను నరికి చంపిన కిరాతకుడు

పెద్దకడబూరు న్యూస్‌టుడే: మద్యం మత్తులో కట్టుకున్న భార్యను, పిల్లనిచ్చిన అత్తను వేటకొడవలితో ఓ వ్యక్తి అతి కిరాతకంగా నరికి చంపిన సంఘటన కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం జాలవాడిలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. డీఎస్పీ వినోద్‌కుమార్‌ తెలిపిన ప్రకారం... స్థానికుడైన కురవ నాగరాజుకు ఆదోనికి చెందిన కురువ బీమక్క అలియాస్‌ లక్ష్మమ్మ కుమార్తె శాంతితో పన్నెండేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నాగరాజు ప్రైవేటుగా విద్యుత్తు పనులు చేస్తుంటాడు. ఇటీవల నిత్యం మద్యం తాగుతూ భార్యతో గొడవపడి... పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలంటూ వేధిస్తున్నాడు. దీంతో నెలరోజుల కిందట శాంతి పుట్టింటికి వెళ్లిపోయారు. ఇరవై రోజులైనా తిరిగి రాకపోవడంతో నాగరాజు అత్తారింటికి వెళ్లి, బావమరుదులను ఒప్పించి వెనక్కి తీసుకొచ్చాడు. ఇంటికొచ్చాక అతనిలో మార్పు రాకపోగా... మళ్లీ తాగుతూ శాంతిని వేధించడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో మనవరాలికి ఆటలమ్మ సోకడంతో చూసేందుకు శాంతి తల్లి భీమక్క శుక్రవారం జాలవాడికి వచ్చారు. నాగరాజు మద్యం మత్తులో తన కూతురుతో గొడవ పడుతుండటంతో భీమక్క మందలించారు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన నాగరాజు వేట కొడవలితో పిల్లల ఎదుటే శాంతిపై దాడి చేశాడు. అడ్డుకున్న భీమక్కనూ నరికాడు. తీవ్ర గాయాలతో ఇద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. రక్తమోడి పడి ఉన్న తల్లి, అమ్మమ్మను చూసి పిల్లలు భీతిల్లారు. వారిని తమ తండ్రే చంపినట్లు పిల్లలు చెప్పడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. నాగరాజు పరారీలో ఉన్నాడు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని