Andhra News: రూ.87 కోట్ల ఆస్తిని రూ.11 కోట్లకే కొట్టేశారు

పల్నాడు జిల్లా వైకాపా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. విజయవాడ కెనరా బ్యాంకు ఏజీఎం విజయరామరాజుతో కుమ్మక్కై నాదెండ్ల మండలం సాతులూరులోని అమరా ఇంజినీరింగ్‌ కళాశాల భవనాలను చౌకగా దక్కించుకున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

Updated : 01 Feb 2023 08:14 IST

వైకాపా ఎమ్మెల్యే తీరుపై విమర్శలు
సామాజిక మాధ్యమాల్లో ప్రచారం  
అన్యాయం జరిగిందన్న ఆవేదనతో కళాశాల ఛైర్మన్‌ ఆత్మహత్య

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా వైకాపా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. విజయవాడ కెనరా బ్యాంకు ఏజీఎం విజయరామరాజుతో కుమ్మక్కై నాదెండ్ల మండలం సాతులూరులోని అమరా ఇంజినీరింగ్‌ కళాశాల భవనాలను చౌకగా దక్కించుకున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బ్యాంకు అధికారులు అన్యాయం చేశారని ఆరోపిస్తూ కళాశాల ఛైర్మన్‌ అమరా వెంకటేశ్వరరావు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి, మంగళవారం మృతి చెందడంతో ఈ ఉదంతం కలకలం సృష్టిస్తోంది. రూ. 87 కోట్ల విలువైన ఆయన ఆస్తిని వేలంలో బిడ్డర్లను భయపెట్టి రూ. 11 కోట్లకే సాంతం చేసుకున్నారని, మృతుని కుటుంబ సభ్యులతో వైకాపా నేతలు బేరసారాలు సాగిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.

అది నిజం కాదు: రావెల సత్యనారాయణ

ఈ కళాశాల భవనాలను ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు దక్కించుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తిరుమల ఇంజినీరింగ్‌ కళాశాల కార్యదర్శి రావెల సత్యనారాయణ తెలిపారు. తాము జనవరి 16న వేలంలో వెంకటరమణ ఛారిటబుల్‌ ట్రస్టు తరఫున పాల్గొన్నామని, బ్రహ్మనాయుడుతో పాటు దండా బ్రహ్మానందం, బత్తిన నాగేశ్వరరావు, డాక్టర్‌ నలబోతు వెంకట్రావు అందులో భాగస్వాములని చెప్పారు. కొన్నేళ్లుగా అమరా కళాశాల భవనాలను కెనరా బ్యాంకు అధికారులు వేలం వేస్తున్నా ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. కళాశాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాము వేలంలో పాల్గొన్నామని వివరించారు. రూ. 11.06 కోట్లకు రూ. 20 వేలు కలిపి బిడ్డు వేశామన్నారు. అయితే రూ. 87 కోట్ల విలువైన ఆస్తిని తక్కువకే దక్కించుకున్నామనే ప్రచారం నిజం కాదని చెప్పారు. ఇప్పటికైనా వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు కోరితే తాము విరమించుకునేందుకు సిద్ధమని చెప్పారు. వేలం సందర్భంగా కోర్టులో కేసులు వేసిన వెంకటేశ్వరరావు తమను సంప్రదించినా విరమించుకునేవారమని పేర్కొన్నారు. వెంకటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడటం తమను కలిచివేసిందని తెలిపారు.

తెదేపా ఆరోపణలివి: ఎమ్మెల్యే గోపిరెడ్డి

అమరా ఇంజినీరింగ్‌ కళాశాల ఛైర్మన్‌ అమరా వెంకటేశ్వరరావు మృతికి వైకాపా నేతలే కారణమంటూ తెదేపా నేతలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని నరసరావుపేట వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళవారం రాత్రి విలేకరులతో అన్నారు. బ్యాంకు అధికారులు తమకు అన్యాయం చేశారని వెంకటేశ్వరరావు భార్య చెప్పినా ఇంకా తెదేపా నేతలు తమపై ఆరోపిస్తున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని