Andhra News: బొట్టు, గోరింటాకు పెట్టుకుంటే జరిమానాలు.. ప్రిన్సిపల్‌ వేధింపులు

శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినులను ప్రిన్సిపల్‌ వేధిస్తుండటంతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేసిన ఉదంతమిది.

Updated : 01 Feb 2023 09:17 IST

ఇద్దరు యువతుల ఆత్మహత్యాయత్నం

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినులను ప్రిన్సిపల్‌ వేధిస్తుండటంతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేసిన ఉదంతమిది. బాధితుల కథనం ప్రకారం... కర్నూలు డీఎంహెచ్‌వో కార్యాలయ ప్రాంగణంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో 30 మంది విద్యార్థినులకు మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌గా శిక్షణ ఇస్తున్నారు. వీరికి అక్కడే వసతి సౌకర్యం ఉంది. ఈ కోర్సుకు ప్రిన్సిపల్‌, వార్డెన్‌గా విజయ సుశీల వ్యవహరిస్తున్నారు. ఆమె నిత్యం వేధిస్తుండటం... బొట్టు, గోరింటాకు పెట్టుకున్నా జరిమానా వేస్తుండటంతో విద్యార్థినులు ఇబ్బందులు పడేవారు. దీనికితోడు వ్యక్తిగత సేవలన్నీ చేయించుకుంటున్నారు. ఎవరైనా మాట వినకపోతే ఫెయిల్‌ చేస్తానని బెదిరించేవారు.

వేధింపులు ఎక్కువ కావడంతో శనివారం ఇద్దరు యువతులు ఫ్యాన్‌కు ఉరేసుకునేందుకు యత్నించారు. బాధితులు సోమవారం తమ సమస్యను ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్‌ లక్ష్మీనర్సయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజయ సుశీలను పిలిపించి వసతి గృహంలో ఉండకూడదని.. ఇల్లు చూసుకోవాలని చెప్పారు. తనపై ఫిర్యాదు చేయడంతో విజయ సుశీల ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థినులవద్ద గతంలో తీసుకున్న లేఖలను బూచిగా చూపి తల్లిదండ్రులకు చెబుతానని హెచ్చరించారు. దీంతో శనివారం ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరిలో ఓ యువతి మంగళవారం మళ్లీ బలవన్మరణానికి ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో అధికారులు సెలవులిచ్చి విద్యార్థినులందరినీ ఇంటికి పంపేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని