Hyderabad: ఓ భర్త ఘాతుకం.. నడివీధిలో భార్య దారుణ హత్య

భర్త వేధింపులు భరించలేక వేరుగా ఉంటున్న ఓ మహిళను అతడు నడివీధిలో దారుణంగా హతమార్చాడు. హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 04 Feb 2023 06:58 IST

మెహిదీపట్నం, న్యూస్‌టుడే: భర్త వేధింపులు భరించలేక వేరుగా ఉంటున్న ఓ మహిళను అతడు నడివీధిలో దారుణంగా హతమార్చాడు. హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. లంగర్‌హౌస్‌ డిఫెన్స్‌కాలనీ (హాషంనగర్‌)కి చెందిన కరీనా బేగం(30)కు టోలిచౌకి హకీంపేటకు చెందిన మహ్మద్‌ యూసుఫ్‌(36)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 5, 3, 2 ఏళ్ల వయసున్న ముగ్గురు చిన్నారులున్నారు. పెళ్లయ్యాక కొద్దిరోజులు సజావుగా ఉన్న భర్త నుంచి తర్వాత ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. పిల్లల కోసం చాలాకాలం ఓపిక పట్టిన ఆమె భరించలేక ఏడాదిన్నర క్రితం పిల్లలతో పుట్టింటికి చేరారు. చిన్నారుల పోషణ కోసం లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఉపాధ్యాయినిగా చేరారు. అయితే తన దారికి రావట్లేదనే అక్కసుతో యూసుఫ్‌ నాలుగైదు రోజులుగా భార్య కదలికలను గమనిస్తూ వచ్చాడు. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కరీనా బేగం స్కూలుకు వెళ్లేందుకు ఇంట్లోంచి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లేసరికి అక్కడ ప్రత్యక్షమైన భర్త మాట్లాడుతున్నట్లు నటిస్తూ.. నడుచుకుంటూ వెళ్తున్న ఆమె తలపై రాడ్డుతో బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు లంగర్‌హౌస్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని