ఐటీ ఉద్యోగాల పేరిట టోకరా

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నిరుద్యోగుల నుంచి డబ్బు గుంజుతున్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు బెంగళూరు కోడిగెహళ్లి పోలీసులు శుక్రవారం వెల్లడించారు.

Published : 04 Feb 2023 05:14 IST

బెంగళూరులో ఏపీ ముఠా అరెస్టు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నిరుద్యోగుల నుంచి డబ్బు గుంజుతున్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు బెంగళూరు కోడిగెహళ్లి పోలీసులు శుక్రవారం వెల్లడించారు. నిందితుల ఖాతాల నుంచి రూ.5,95,585 నగదును డ్రా చేయకుండా కట్టడిచేశారు. విజయవాడకు చెందిన మల్లు శివశంకర్‌రెడ్డి అలియాస్‌ గోపీచంద్‌ (26), గుంజ మంగారావు (35), ఇబ్రహీంపట్నానికి చెందిన షేక్‌ శహబాషి (30), గుంటూరుకు చెందిన మహేశ్‌ (21) అనే యువకులను అరెస్టు చేసినట్లు డీసీపీ డాక్టర్‌ అనూప్‌శెట్టి వెల్లడించారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. దాన్ని నమ్మిన హైదరాబాద్‌వాసి- ప్రదీప్‌ మల్లు శివశంకర్‌రెడ్డిని సంప్రదించాడు. జనవరి 11న ప్రదీప్‌ బెంగళూరు రాగా, ఆ నలుగురు స్వాగతం పలికారు. వారు వచ్చిన కారు వివరాలను ప్రదీప్‌ ఫొటో తీసుకుని పెట్టుకున్నాడు. ఉద్యోగంలో చేరేందుకు కావల్సిన పత్రాల కోసం రూ.30వేలు ఇవ్వాలని నిందితులు చెప్పగా, ప్రదీప్‌ గూగుల్‌ పే పనిచేయలేదు. నిందితులు అతడి ఫోన్‌ తీసుకుని పరిశీలించారు. అందులో కారు ఫొటో గుర్తించి.. ఎందుకు తీశావని దాడి చేసి, రూ.6 లక్షలు బలవంతంగా ఖాతాలో వేయించుకున్నాక.. యలహంక సమీపంలో దింపేసి వెళ్లిపోయారు. ప్రదీప్‌ కోడిగెహళ్లి పోలీసులకు ఫిర్యాదుచేయడంతో డొంకంతా కదిలింది. మల్లు శివశంకర్‌రెడ్డి ఫేస్‌బుక్‌ ఖాతాతో ఉద్యోగాల వ్యాపారం మొదలుపెట్టాడని గుర్తించారు. అతడిని అరెస్టుచేయగా, మిగిలిన ముగ్గురి వివరాలూ బయటపడ్డాయి.

కటకటాల్లోకి మరో యువకుడు: నకిలీ ఇన్‌స్టాగ్రాం ఖాతాను ప్రారంభించి, యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి, దారుణాలకు పాల్పడుతున్న ఆరోపణపై గుంటూరు నివాసి ప్రసాద్‌ అలియాస్‌ దిల్లీ ప్రసాద్‌ (29) అనే యువకుడిని బెంగళూరు ఆగ్నేయ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.  ఉద్యోగాల కోసం సంప్రదించే యువతులను మోసగించి, లైంగికదాడులకు పాల్పడినట్లు గుర్తించామని నగర పోలీసు కమిషనర్‌ ప్రతాప్‌రెడ్డి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని