వాట్సప్‌ డీపీగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఫొటో.. మోసాలకు పాల్పడుతున్న యువకుడి అరెస్టు

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఫోటోను వాట్సప్‌లో ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకుని జనాన్ని మోసగిస్తూ, సీనియర్‌ అధికారుల నుంచి ప్రతిఫలాలు పొందడానికి ప్రయత్నిస్తున్న 22 ఏళ్ల గగన్‌దీప్‌ సింగ్‌ బండారం బయటపడింది.

Updated : 07 Feb 2023 06:24 IST

దిల్లీ: ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఫోటోను వాట్సప్‌లో ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకుని జనాన్ని మోసగిస్తూ, సీనియర్‌ అధికారుల నుంచి ప్రతిఫలాలు పొందడానికి ప్రయత్నిస్తున్న 22 ఏళ్ల గగన్‌దీప్‌ సింగ్‌ బండారం బయటపడింది. అతడిని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం ప్రకటించారు. జమ్మూకు చెందిన గగన్‌దీప్‌ సింగ్‌ 2017 నుంచి ఇటలీలో కుటుంబంతోపాటు నివసిస్తున్నాడు. భారత్‌లో 9వ తరగతి వరకు చదివిన అతను ఇటలీలో 12వ తరగతి పూర్తి చేసి అక్కడే ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. యూట్యూబ్‌ వీడియోలు చూసి ఉప రాష్ట్రపతిలా జనాన్ని మభ్యపెట్టాలని పథకం పన్నాడు. అతడికి భారతీయ మొబైల్‌ నంబరు మీద వచ్చిన ఓటీపీని అందించి వాట్సప్‌లో నకిలీ డీపీని ఉంచడానికి సహకరించిన అశ్వినీ కుమార్‌(29)ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. కుమార్‌ పంజాబ్‌కు చెందిన వ్యక్తి. వీరి కుంభకోణం గురించి ఉప్పందిన మీదట పోలీసులు గగన్‌దీప్‌ సింగ్‌ ఇటలీ నుంచి మోసానికి పాల్పడుతున్నట్లు ఐపీ చిరునామా ద్వారా గుర్తించారు. విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం, బ్యాంకులు, ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం ద్వారా అతడి పూర్తి వివరాలు తెలుసుకుని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని