Kurnool: కొడుకును ఒప్పించాడు.. కత్తులు కొని తెచ్చాడు

అనుమానం పెనుభూతమై.. అవమానం దానికి తోడై ఇద్దరి దారుణ హత్యలకు దారి తీసినట్లు తెలుస్తోంది.

Updated : 16 Mar 2023 08:41 IST

 కర్నూలులో జంట హత్యల సూత్రధారి తండ్రే!

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: అనుమానం పెనుభూతమై.. అవమానం దానికి తోడై ఇద్దరి దారుణ హత్యలకు దారి తీసినట్లు తెలుస్తోంది. కర్నూలులో కొత్తగా పెళ్లయిన ఓ వ్యక్తి తన తండ్రితో కలిసి భార్యను, అత్తను హతమార్చిన విషయం విదితమే. తెలంగాణలోని వనపర్తికి చెందిన రుక్మిణి, ఆమె తల్లి రమాదేవి మంగళవారం ప్రాణాలు కోల్పోగా.. రుక్మిణి తండ్రి వెంకటేశ్వర్లు గాయాలతో తప్పించుకున్నారు. ఈ హత్యలకు సంబంధించి భర్త శ్రావణ్‌, అతని తండ్రి ప్రసాద్‌, తల్లి కృష్ణవేణిలపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. కోడలికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం, కుమారుడు శ్రావణ్‌కు అత్తింటి వారు సున్తీ శస్త్రచికిత్స చేయించి పరువు తీశారన్న కోపం ప్రసాద్‌ను హత్యకు ప్రేరేపించినట్లు తెలిసింది. కుమారుడు వద్దన్నా ప్రసాదే పట్టుబట్టి వారిని చంపడానికి అతణ్ని కూడా ఒప్పించాడు. దీంతో శ్రావణ్‌ మంగళవారం వనపర్తికి వెళ్లి భార్య, అత్తామామలను కర్నూలు తీసుకువచ్చాడు. ఈలోపు ప్రసాద్‌ రెండు కత్తులు కొని తెచ్చాడు. వారు రాగానే ఇద్దరూ కలిసి రుక్మిణి, రమాదేవిలను పొడిచి చంపారు. గాయాలతో తప్పించుకున్న వెంకటేశ్వర్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

రుక్మిణి, రమాదేవి మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు వారి బంధువులెవరూ రాలేదు. రుక్మిణి తల్లిదండ్రులైన రమాదేవి, వెంకటేశ్వర్లు ఇరవై ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ కారణంగానే వారు తమ కుటుంబాలకు దూరమయ్యారనే అభిప్రాయం ఉంది. బుధవారం మృతదేహాలకు శవపరీక్షలు చేయించిన అనంతరం కల్లూరు శ్మశానవాటికకు తరలించి పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని