Kurnool: సున్తీ చేయించారనే చంపేశారు.. జంట హత్యల కేసులో ఆసక్తికర విషయాలు

కర్నూలు నగరంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితులైన.. కర్నూలు చింతలమునినగర్‌కు చెందిన నారపురం శ్రావణ్‌కుమార్, అతని తండ్రి నారపురం వరప్రసాద్, తల్లి కృష్ణవేణిని కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 17 Mar 2023 09:20 IST

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు నగరంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితులైన.. కర్నూలు చింతలమునినగర్‌కు చెందిన నారపురం శ్రావణ్‌కుమార్, అతని తండ్రి నారపురం వరప్రసాద్, తల్లి కృష్ణవేణిని కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 14న శ్రావణ్‌కుమార్‌ భార్య రుక్మిణి, అత్త కొత్త రమాదేవి దారుణ హత్యకు గురికాగా మామ కొత్త వెంకటేశ్‌ తీవ్ర గాయాలతో తప్పించుకున్న సంగతి విదితమే. వర ప్రసాద్‌ తన కుమారుడు శ్రావణ్‌తో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టగా కృష్ణవేణి సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన సందర్భంగా కర్నూలులోని డీఎస్పీ కార్యాలయంలో సీఐ శంకరయ్య.. ఎస్సై రామయ్యలతో కలిసి గురువారం వివరాలు వెల్లడించారు. 

నంద్యాలకు చెందిన వరప్రసాద్, కృష్ణవేణి దంపతులు ముప్పై ఏళ్ల కిందట కర్నూలు వచ్చి చింతల మునినగర్‌లో స్థిరపడ్డారు. వీరి ఏకైక కుమారుడు శ్రావణ్‌కుమార్‌ బీటెక్‌ చదివి ఏడాదిగా ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన కాల్‌ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. పెళ్లి సంబంధాలు చూస్తున్న క్రమంలో వనపర్తిలో స్థిరపడిన వంట మాస్టర్‌ కొత్త వెంకటేశ్, రమాదేవి దంపతుల ఏకైక కుమార్తె రుక్మిణితో సంబంధం కుదిరి పెళ్లి నిశ్చయమైంది. శ్రావణ్‌కుమార్‌ ఆమెకు ఓ సెల్‌ఫోన్‌ కానుకగా ఇచ్చాడు. అతను సదరు సెల్‌ఫోన్‌లో ఓ నిఘా యాప్‌ను నిక్షిప్తం చేసి తన ఇ-మెయిల్‌కి అనుసంధానం చేసుకున్నాడు. రాఘవేంద్రగౌడ్‌ అనే యువకుడికి ఆమె పలుమార్లు ఫోన్‌ చేస్తున్నట్లు ఇతనికి సమాచారం వచ్చింది. అనుమానిస్తున్న క్రమంలోనే మార్చి 1న ఇద్దరికీ పెళ్లి జరిగింది.

మొదటి రాత్రి శ్రావణ్‌కుమార్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురవడంతో దూరంగా ఉన్నాడు. శ్రావణ్‌కుమార్‌ విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. అప్పుడే శ్రావణ్‌ తన భార్య సెల్‌ఫోన్‌లోని యాప్‌లో నమోదైన ఫోన్‌కాల్స్‌ విన్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. పెళ్లికి ముందు నుంచే రుక్మిణి ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు చేయటంతో ఇరువురి మధ్య వైరం మరింత ముదిరింది. ఆ తర్వాత శ్రావణ్‌కుమార్‌ను అత్తింటివారు హైదరాబాద్‌కు తీసుకెళ్లగా వైద్యులు సున్తీ చేశారు.

విషయం తెలిసిన వరప్రసాద్‌ తన కుమారుడికి లైంగిక సామర్థ్యం తగ్గించేందుకు కుట్ర పన్ని సున్తీ చేయించారని అపోహ పడ్డాడు. తమ పరువు పోతుందని కోపంతో రగిలిపోయాడు. తన కుమారుడితో చర్చించిన వరప్రసాద్‌ అందరినీ చంపేయాలని పథక రచన చేశాడు. మొదట మార్చి 10నే చంపాలని నిర్ణయించగా కుదరలేదు. ఆ తర్వాత శ్రావణ్‌కుమార్‌ వనపర్తి వెళ్లి భార్య, అత్తామామను తీసుకొచ్చాడు. అప్పటికే వరప్రసాద్‌ కాలనీ సమీపంలోని ఓ దుకాణంలో రెండు కత్తులు కొనుగోలు చేసి ఇంట్లో సిద్ధంగా ఉంచాడు. రుక్మిణిని ఇంట్లో ఉంచి ఆమె తల్లిదండ్రులను మొదటి అంతస్తులోకి పంపి కృష్ణవేణిని ఇంట బయట కాపలాగా ఉంచారు.

తర్వాత వరప్రసాద్, శ్రావణ్‌ మొదట రుక్మిణి నోరు మూసి కత్తులతో పొడిచి చంపారు. వెనువెంటనే వరప్రసాద్‌ మొదటి అంతస్తుకు చేరుకుని రమాదేవిని విచక్షణరహితంగా పొడిచారు. అడ్డుకునేయత్నం చేసిన వెంకటేశ్‌ను పలుమార్లు పొడవగా తీవ్ర గాయాలతో ఇంట్లో నుంచి బయటపడి తప్పించుకున్నాడు. రమాదేవి పారిపోలేక ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు రావడంతో వెంకటేశ్‌ 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు. నగర శివారులోని గుత్తి పెట్రోలు బంకు వద్ద ముగ్గురు నిందితులను గురువారం ఉదయం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపుతున్నట్లు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు