Andhra News: ఈ పాపం ఇసుక దందాదే!

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన ఇసుక వ్యాపారి ప్రేమ్‌రాజు ఆత్మహత్యకు కారణాలపై ఆయన సన్నిహితుల నుంచి పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 20 Mar 2023 08:09 IST

20 నెలలుగా ఇసుక వ్యాపారం నిర్వహిస్తున్న ప్రేమ్‌రాజు
నెలకు రూ.21 కోట్ల చొప్పున చెల్లించలేక తీవ్ర ఒత్తిడి
3 నెలల కిందట వ్యాపారం నుంచి తప్పించడంతో మానసిక వేదన
ఆత్మహత్యకు అదే కారణమని భావిస్తున్న సన్నిహితులు, మిత్రులు

ఈనాడు, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన ఇసుక వ్యాపారి ప్రేమ్‌రాజు ఆత్మహత్యకు కారణాలపై ఆయన సన్నిహితుల నుంచి పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థికపరమైన అంశాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నా.. అసలు ప్రేమ్‌రాజుకు ఇసుక వ్యాపారంలో ప్రవేశించేవరకూ పెద్దగా ఆర్థిక సమస్యలేమీ లేవని చెబుతున్నారు. ఇసుక దందాల్లో చక్రం తిప్పుతున్నవారు నిర్దేశించిన నెలవారీ భారీ మొత్తాన్ని చెల్లించలేకపోవంతో వ్యాపారం నుంచి తప్పించారని, దాంతో తీవ్ర ఒత్తిడికి, మానసిక వేదనకు గురవడం వల్లే సున్నిత మనస్కుడైన ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్న అభిప్రాయం సన్నిహితుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ పాపం ఇసుక దందాలో చక్రం తిప్పుతున్నవారిదేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు చెబుతున్న సమాచారం ప్రకారం... రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఇసుక వ్యాపారాన్ని ప్రైవేటు సంస్థకు కట్టబెట్టాక ఉపగుత్తేదారుగా ఉన్న టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రేమ్‌రాజు చాలా కాలం పనిచేశారు. టర్న్‌కీ సంస్థ ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఒక ఇన్‌ఛార్జిని నియమించి ఇసుక తవ్వకాలు, విక్రయాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌ఛార్జిగా ప్రేమ్‌రాజు పనిచేశారు.

టర్న్‌కీని తప్పించాక..

2022 ఆగస్టులో టర్న్‌కీ సంస్థను ఇసుక వ్యాపారం నుంచి తప్పించారు. ప్రతి జిల్లాలో అధికారపార్టీ నాయకులు, కొందరు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి, అనధికారిక ఉపగుత్తేదారులుగా వ్యవహరిస్తున్నారు. వారు రీచ్‌ల వారీగా ఇసుక వ్యాపారాన్ని స్థానిక నేతలకు అప్పగించారు. వారి నుంచి కొంత డిపాజిట్‌ తీసుకున్నారు. ఆపై నెలవారీగా చెల్లించాల్సిన మొత్తాన్నీ నిర్ణయించారు. అప్పటికే ఇసుక వ్యాపారంలో అనుభవం ఉన్న ప్రేమ్‌రాజు... ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వ్యాపారానికి ముందుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్న పెద్దలకు ఆయన డిపాజిట్‌గా రూ.25 కోట్లు చెల్లించినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ప్రతి నెలా రూ.21 కోట్ల చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్టు ఆ జిల్లాకు చెందిన వ్యాపారులు, రవాణాదారులు చెబుతున్నారు. 

వ్యాపారం అంతగా జరగక...

ఇసుక వ్యాపారం ఆశించిన విధంగా జరగక ప్రేమ్‌రాజు నెలకు సగటున రూ.8-9 కోట్ల చొప్పున మూడు నెలలు నష్టపోయినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నెలకు రూ.21 కోట్లు చొప్పున చెల్లించలేకపోవడంతో... ఆయనను ఉన్నట్టుండి ఇసుక వ్యాపారం నుంచి తప్పించారు. ఆయన చెల్లించిన రూ.25 కోట్ల డిపాజిట్‌ కూడా వెనక్కు ఇవ్వలేదని సమాచారం. మిత్రులు, సన్నిహితుల నుంచి నిధులు సమీకరించి వ్యాపారంలో పెట్టానని, తనను కొనసాగించాలని ఆయన ఎంతగా బతిమాలుకున్నా కనికరించలేదని సమాచారం. దాంతో ఆయన కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు.

ఇసుకలో అంతా మాయే!

పేరుకు జేపీ సంస్థ ప్రధాన గుత్తేదారు అయినా.. ఉమ్మడి కడప జిల్లాలో ఓ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సోదరుడు, అనంతపురం జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరికి ఆనుకొని ఉండే ఓ నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే అనుయాయులు, రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఓ రవాణాదారుడు, ఆ జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు ఇసుక వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇసుక వ్యాపారంలో కొందరు నేతలు, వ్యాపారులు భాగస్వాములు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఓ ఎమ్మెల్యే బావమరిది ఆధ్వర్యంలో ఇసుక వ్యాపారం చేసి, కొద్దిరోజుల క్రితం ఇతరులకు అప్పగించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఇసుకలో దందా జరుగుతున్నా, గనులశాఖ మాత్రం వాస్తవాలను కప్పిపుచ్చుతూ, పారదర్శకంగా ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరిపిస్తున్నామని చెబుతోంది.

జిల్లాకో రేటు

జిల్లాస్థాయిలో ఇసుక వ్యాపారం అప్పగించిన నాయకులు, వ్యాపారులు నెలకింత మొత్తం చెల్లించాలని లక్ష్యం నిర్దేశించినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరిలో రూ.21 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.25 కోట్లు, కృష్ణాలో రూ.21 కోట్లు, గుంటూరులో రూ.18 కోట్లు, నెల్లూరులో రూ.17 కోట్లు, కడపలో రూ.16 కోట్లు.. ఇలా ప్రతి జిల్లాలో ఎంత చెల్లించాలో ఖరారుచేసి, గత సెప్టెంబరు నుంచి ఇసుక వ్యాపారాన్ని అధికారపార్టీ నేతలు, అక్కడి వ్యాపారుల చేతుల్లో పెట్టారు.


ప్రేమ్‌రాజు ఆత్మహత్యకు జేపీ సంస్థ ఒత్తిళ్లే కారణం
- మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌

కళ్లేపల్లి ప్రేమ్‌రాజు ఆత్మహత్యకు జేపీ పవర్‌ వెంచర్స్‌ సంస్థ ఒత్తిళ్లే కారణమని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ ఆరోపించారు. జేపీ సంస్థ పెద్దలు తీవ్రంగా ఒత్తిడి చేయడం వల్లే ప్రేమ్‌రాజు మృతి చెందినట్లు స్థానికులూ ధ్రువీకరిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని