రోడ్డు ప్రమాదంలో స్నేహితుల దుర్మరణం

వాళ్లిద్దరూ స్నేహితులు.. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఈక్రమంలో కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్న స్నేహితుడిని వెంట తీసుకెళ్లేందుకు మరో స్నేహితుడు ద్విచక్ర వాహనంపై చెన్నై బయల్దేరగా..

Updated : 21 Mar 2023 06:46 IST

ఎన్‌హెచ్‌పై చెక్‌పోస్టు గోడను ఢీకొన్న ద్విచక్ర వాహనం

తడ, న్యూస్‌టుడే: వాళ్లిద్దరూ స్నేహితులు.. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఈక్రమంలో కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్న స్నేహితుడిని వెంట తీసుకెళ్లేందుకు మరో స్నేహితుడు ద్విచక్ర వాహనంపై చెన్నై బయల్దేరగా.. రహదారి ప్రమాదానికి గురై ఇద్దరూ తనువు చాలించారు. తిరుపతి జిల్లా తడ మండలం పన్నంగాడు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి డైవర్షన్‌ గోడను ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో నెల్లూరు జిల్లా కలువాయి మండలం నూకనపల్లికి చెందిన దండు వెంకటరమణ (30), యలకచర్ల అరుణ్‌ (28) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం తమిళనాడు పోలీసులు గుర్తించి తడ పోలీసులకు సమాచారం అందించారు.

* కలువాయిలో ఉంటున్న వెంకటరమణ టిప్పర్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ ఇంట్లో ఉంటున్నాడు. అవివాహితుడు. ఇతనికి ఒక అన్న ఉన్నాడు. వారం రోజలుగా కుటుంబ కలహాలతో అలిగి ఇంటికి వెళ్లడం మానేశాడు. యలకచర్ల అరుణ్‌కు ఏడాదిన్నర క్రితం పెళ్లయింది. ప్రస్తుతం భార్య గర్భిణి. తల్లిదండ్రులు అనంతమ్మ, చిన్నరేణయ్యలకు ఇద్దరు సంతానం. అరుణ్‌ తమిళనాడు పరిధిలోని కోడంబాక్కం వద్ద హౌస్‌కీపింగ్‌ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం స్వగ్రామం వచ్చిన అతను స్నేహితుడు వెంకటరమణను కలుసుకున్నాడు. అతడిని ఏదైనా పనిలో పెట్టాలని నిర్ణయించుకుని సాయంత్రం ఇద్దరూ ద్విచక్ర వాహనంలో చెన్నై బయల్దేరారు. తడ మండలం పన్నంగాడు వద్దకు వచ్చేసరికి తమిళనాడు పరిధిలోని ఎళావూరు చెక్‌పోస్టుకు వాహనాలను మళ్లించేందుకు ఏర్పాటుచేసిన డైవర్షన్‌ గోడను అదుపుతప్పి ఢీకొన్నాడు. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తడ ఎస్సై జేపీ శ్రీనివాసరెడ్డి మృతుల వివరాలు గుర్తించి బంధువులకు సమాచారం చేరవేశారు. మృతదేహాలను సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

* తొలుత ఘటన జరిగిన ప్రదేశం ఎవరి పరిధిలోకి వస్తుందన్న విషయమై సందిగ్ధం నెలకొనడంతో చివరకు సర్వేయరు సహకారంతో ఏపీ పరిధిగా తేల్చారు. తమిళనాడు పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని