పాఠశాల బస్సు చక్రాల కిందపడి విద్యార్థి మృతి

రెక్కలుముక్కలు చేసుకొని కుమారుడిని చదివించి ప్రయోజకుడిని చేయాలన్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి.

Published : 21 Mar 2023 04:46 IST

బస్సుకు తలుపు సరిగా లేకపోవడం, అతివేగం వల్లే ప్రమాదం

భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌టుడే: రెక్కలుముక్కలు చేసుకొని కుమారుడిని చదివించి ప్రయోజకుడిని చేయాలన్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. రోజూలాగే పాఠశాలకు వెళ్లిన కుమారుడు ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లాడనే వార్త వారికి తీరని వేదన మిగిల్చింది. ప్రమాదవశాత్తు పాఠశాల బస్సు చక్రాల కింద పడి విద్యార్థి మృతిచెందాడు. ఈ విషాదం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం భీమనపల్లి శివారులో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... భీమనపల్లి పంచాయతీ హైదర్‌పూర్‌ గ్రామానికి చెందిన వడ్డెమోని శ్రీనివాస్‌, రాణి దంపతుల చిన్నకుమారుడు అభిలాష్‌(8) భూదాన్‌పోచంపల్లిలోని లిటిల్‌ఫ్లవర్‌ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఉదయం పాఠశాల బస్సులో బడికి వెళ్లి మధ్యాహ్నం తిరిగి వస్తుండగా భీమనపల్లి శివారులోని చెరువు వద్ద అభిలాష్‌ ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. పాఠశాల బస్సు తలుపు సరిగా లేకపోవడం, డ్రైవర్‌ వేగంగా బస్సును నడపడంతో ఆ విద్యార్థి కిందపడ్డాడు. అతని పొట్టపై భాగం నుంచి బస్సు వెనుక చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కుమారుడు శవమై తిరిగి రావడంతో తల్లిదండ్రుల రోదనలు కంటతడి పెట్టించాయి. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్‌పై, పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని