హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్రకు సూత్రధారి ఫర్హతుల్లానే!

గతేడాది దసరా రోజున హైదరాబాద్‌లో వరుస పేలుళ్లకు పాల్పడాలని ఉగ్రకుట్రకు పథక రచన చేసిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఛార్జిషీటు దాఖలు చేసింది.

Updated : 30 Mar 2023 07:39 IST

నిందితులకు లష్కరే నేతతో సంబంధాలు
న్యాయస్థానంలో ఎన్‌ఐఏ ఛార్జిషీటు

ఈనాడు, హైదరాబాద్‌: గతేడాది దసరా రోజున హైదరాబాద్‌లో వరుస పేలుళ్లకు పాల్పడాలని ఉగ్రకుట్రకు పథక రచన చేసిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులు మహ్మద్‌ అబ్దుల్‌ వాజిద్‌ అలియాస్‌ జాహెద్‌, సమీయుద్దీన్‌ అలియాస్‌ సమీ, మాజ్‌ హసన్‌ ఫరూఖ్‌ అలియాస్‌ మాజ్‌.. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తయిబా నాయకుడు ఫర్హతుల్లా ఘోరీతో సంబంధాలు పెట్టుకున్నట్లు అభియోగపత్రంలో పేర్కొంది. లష్కరేకే చెందిన సిద్ధిఖ్‌ బిన్‌ ఉస్మాన్‌ అలియాస్‌ అబూ హంజాలా, అబ్దుల్‌ మాజిద్‌ అలియాస్‌ చోటు ఇతర నేతలు, నిర్వాహకులతోనూ వీరికి సంబంధాలున్నాయని స్పష్టం చేసింది. అంతా కలిసి హైదరాబాద్‌లోని రద్దీ ప్రదేశాల్లో పేలుళ్లతో విధ్వంసం సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ప్రస్తావించింది. గతేడాది దసరా రోజున ఉగ్రకుట్ర పథకాన్ని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భగ్నం చేశారు. ఈ ఏడాది జనవరిలో కేసు ఎన్‌ఐఏకు బదిలీ అయింది. ఈ మేరకు దర్యాప్తు మొదలుపెట్టిన సంస్థ బుధవారం నాంపల్లిలోని ఎన్‌ఐఏ న్యాయస్థానంలో అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. అందులో ప్రస్తావించిన వివరాలివీ..

హవాలా మార్గంలో నిధులు..!

నిందితులు జాహెద్‌, సమీ, మాజ్‌ ముగ్గురూ లష్కరే తయిబాతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. లష్కరే నేతలు ఫర్హతుల్లా ఘోరీ, సిద్ధిఖ్‌ బిన్‌ ఉస్మాన్‌, అబ్దుల్‌ మాజిద్‌లు పాకిస్థానీలు. ఘోరీ తన కుట్ర కోసం అంతర్జాలం ద్వారా జాహెద్‌ను నియమించి హవాలా ద్వారా నిధులు పంపాడు. లష్కరేలో మరింత మందిని నియమించి ఉగ్రవాద కార్యకలాపాలు వేగవంతం చేయాలని ఆదేశించాడు. దీని ప్రకారం.. జాహెద్‌.. సమీ, మాజ్‌, మహ్మద్‌ కలీమ్‌లను లష్కరే కోసం పనిచేసేలా పురిగొల్పాడు. పేలుళ్ల కుట్రలో భాగంగా హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ జాతీయ రహదారిలోని మనోహరాబాద్‌ గ్రామ సమీపంలో సెప్టెంబరు 28న డెడ్‌ డ్రాప్‌ విధానంలో నాలుగు హ్యాండ్‌ గ్రనేడ్లను ఉంచారు. సమీ ద్వారా హ్యాండ్‌ గ్రనేడ్లను జాహెద్‌ తెప్పించుకున్నాడు. వాటిని సమీ, మాజ్‌లకు చెరొకటి ఇచ్చాడు. లష్కరే నేతల సూచన ప్రకారం.. దసరా రోజున భారీఎత్తున జనం గుమిగూడే ప్రాంతాల్లో వాటిని విసరాలని ఇద్దరికీ చెప్పాడు. ఈ కుట్రపై సమాచారం అందుకున్న హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భగ్నం చేశారు. నిందితుల నివాసాల నుంచి నాలుగు గ్రనేడ్లు, జాహెద్‌ నుంచి రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారని ఎన్‌ఐఏ ఛార్జిషీటులో వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని