వైఎస్‌ఆర్‌ జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి..

తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా... ఘాట్‌ రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడా కుమారుడు. వైయస్‌ఆర్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ అమనుష ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

Updated : 03 May 2023 07:58 IST

కడప, నేరవార్తలు, న్యూస్‌టుడే: తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా... ఘాట్‌ రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడా కుమారుడు. వైయస్‌ఆర్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ అమనుష ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు కడప డీఎస్పీ ఎండీ షరీఫ్‌ తెలిపారు. దువ్వూరు మండలం సింగనపల్లెకు చెందిన బొమ్ము చిన్నపుల్లారెడ్డి(62) కుమారుడు రాజశేఖర్‌రెడ్డి ఓ ప్రైవేటు పాఠశాల బస్సు క్లీనర్‌. చిన్నపుల్లారెడ్డి కొన్నేళ్లుగా క్షయతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించిన తండ్రిని రాజశేఖర్‌రెడ్డి ఫిబ్రవరిలో కడప సమీపంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించి, ఇంటికి వెళ్లిపోయాడు. ఆసుపత్రి సిబ్బంది పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో అదే నెల 23న రాజశేఖర్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లాడు. వైద్య సిబ్బంది చిన్నపుల్లారెడ్డిని డిశ్ఛార్జి చేయగా... ఆసుపత్రి దగ్గరే ఆయన చనిపోయారు. తండ్రి మృతదేహానికి ఆసుపత్రికి చెందిన దుప్పటిని చుట్టిన రాజశేఖర్‌రెడ్డి... ఓ ఆటోను బాడుగకు మాట్లాడుకుని అందులోకి చేర్చాడు. మార్గంమధ్యలో గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డులోకి తీసుకెళ్లి పొదల్లో పడేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తుండటంతో గత నెల 29న పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. వారు గాలించి కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. సంఘటన స్థలంలో ఉన్న దుప్పటిపై లోగోను పరిశీలించిన పోలీసులు... ఆసుపత్రికి వెళ్లి విచారించగా విషయం బయటపడింది. అంత్యక్రియలకు డబ్బుల్లేకనే మృతదేహాన్ని పడేసినట్లు నిందితుడు చెప్పాడు. తండ్రి మృతదేహాన్ని ఇలా నిర్లక్ష్యంగా వదిలేసిన రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని