East Godavari: వధూవరులు డ్యాన్స్ చేయాలని ఒత్తిడి.. పందిట్లో కొట్టుకున్న పెళ్లివారు

ఓ వివాహ వేడుకలో చోటుచేసుకున్న చిన్న వివాదం కొట్లాటకు దారితీయడంతో పలువురికి గాయాలయ్యాయి.

Updated : 16 May 2023 09:54 IST

వివాహ వేడుకలో ఐదుగురికి గాయాలు 

సీతానగరం, న్యూస్‌టుడే: ఓ వివాహ వేడుకలో చోటుచేసుకున్న చిన్న వివాదం కొట్లాటకు దారితీయడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రామచంద్రపురంలో సోమవారం సుబ్రహ్మణ్యం, పూజితల వివాహ వేడుకలకు కుటుంబసభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. పెళ్లికుమార్తె తరఫు బంధువులంతా తాళ్లపూడి మండలం గజ్జరం నుంచి విచ్చేశారు. వివాహం అనంతరం విందు జరుగుతోంది. ఆ సమయంలో వధూవరులిద్దరూ డ్యాన్స్‌ చేయాలంటూ అక్కడున్న వారు ఒత్తిడి తెచ్చారు. ఆడపిల్ల డ్యాన్స్‌ చేయడమేమిటని వధువు తరఫు బంధువులు అభ్యంతరం తెలిపారు. మాటామాటా పెరిగి వరుడి కుటుంబసభ్యులు దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ మహిళకు తల పగిలింది. మరో వ్యక్తికి చేయి విరిగింది. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కోరుకొండ సీఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం వధూవరులతో పాటు వేడుకల్లో పాల్గొన్న వారంతా ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని