విషాదం నింపిన విహారం

హైదరాబాద్‌ గండిపేట సమీపంలోని ఖానాపూర్‌ వద్ద శుక్రవారం ఉదయం 9.56 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

Updated : 20 May 2023 13:08 IST

120 కి.మీ.ల వేగంతో లారీని ఢీకొట్టిన కారు
గండిపేట సమీపంలో నలుగురి దుర్మరణం
ఒకరు బ్రెయిన్‌డెడ్‌, ఇద్దరికి ప్రాణాపాయ స్థితి

నార్సింగి, నిజాంపేట, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ గండిపేట సమీపంలోని ఖానాపూర్‌ వద్ద శుక్రవారం ఉదయం 9.56 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఒకరు బ్రెయిన్‌డెడ్‌ కాగా ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఏడుగురు ప్రయాణించే కారులో 12 మంది వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వీరంతా 14 నుంచి 19 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. స్నేహితురాలికి పెళ్లి కుదిరిన నేపథ్యంలో సరదాగా గడిపేందుకు వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనం 120-130 కి.మీ.ల వేగంతో ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

సరదాగా బయలుదేరి..

హైదరాబాద్‌లోని నిజాంపేటకు చెందిన ఎమిలిపురం సత్తిబాబు దంపతులు స్థానికంగా ఉన్న ఓ అపార్టుమెంటులో వాచ్‌మన్‌లుగా పనిచేస్తున్నారు. వారికి దివ్య(19), అర్జున్‌(14) పిల్లలు. దివ్యకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. జూన్‌ 2న ముహూర్తం. ఈ నేపథ్యంలో కాలనీలో ఇరుగుపొరుగున ఉండే స్నేహితుల కోరిక మేరకు శుక్రవారం సరదాగా గండిపేటలోని ఓషన్‌ పార్కుకు విహారానికి బయలుదేరారు. ఇందుకోసం ఈదులపల్లి శివారెడ్డికి చెందిన కారు తీసుకున్నారు. నిజాంపేటకు చెందిన బైక్‌ మెకానిక్‌ ప్రసాద్‌(19) డ్రైవరుగా వచ్చాడు. వాస్తవానికి కారులో ఏడుగురు మాత్రమే ప్రయాణించే వీలుంది. అయినా డ్రైవరుతో కలిపి మొత్తం 12 మంది కూర్చున్నారు. దివ్య, అర్జున్‌లతోపాటు నిజాంపేటలో నివాసముండే చేవెళ్లకు చెందిన ఈదులపల్లి శివారెడ్డి, సంధ్యారెడ్డి దంపతుల కుమార్తెలు సాయి అంకిత(16), సాయి అర్షిత(17), ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన పాలిటెక్నిక్‌ విద్యార్థి నితిన్‌(17), ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థి తాటి అమృత్‌(20), అతని సోదరుడు ధనుశ్‌(18), బీటెక్‌ తొలి ఏడాది విద్యార్థి ప్రదీప్‌(17), అతని సోదరి సుస్మిత(19), ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థి సత్యవాడ అఖిల(18), ఇంటర్‌ విద్యార్థిని మౌనిక(17) వారిలో ఉన్నారు.

 అతివేగం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌

ప్రసాద్‌ వాహనాన్ని వేగంగా నడుపుతూ ఖానాపూర్‌ దాటగానే బస్సును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో రోడ్డుపక్కనే ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టాడు. దాంతో కారు ముందు భాగం, పైభాగం నుజ్జయిపోయాయి. అంకిత, అర్షిత, నితిన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతావాళ్లు ఒకరిమీద ఒకరు పడి ఇరుక్కుపోయారు. పోలీసులు నలుగురిని అతి కష్టమ్మీద బయటకు తీశారు. క్షతగాత్రులను మెహిదీపట్నంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్సపొందుతూ అమృత్‌ మరణించాడు. డ్రైవర్‌ ప్రసాద్‌ బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రదీప్‌కుమార్‌, అర్జున్‌ల పరిస్థితి విషమంగా ఉంది. అయిదుగురు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో కారులోని స్పీడో మీటరు ధ్వంసమైంది. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు