స్నేహితుడితో సన్నిహితంగా ఉంటే తట్టుకోలేక.. మాట్లాడుకుందామని పిలిచి చంపేశాడు!

తాను పరిచయం చేసిన స్నేహితుడితో తనకంటే ఎక్కువ చనువుగా ఉండటాన్ని సహించలేక ఓ యువకుడు వివాహితను హతమార్చాడు.

Updated : 21 May 2023 12:38 IST

విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ), న్యూస్‌టుడే: తాను పరిచయం చేసిన స్నేహితుడితో తనకంటే ఎక్కువ చనువుగా ఉండటాన్ని సహించలేక ఓ యువకుడు వివాహితను హతమార్చాడు. అనంతరం పోలీసుస్టేషన్‌లో లొంగిపోయి హత్య ఉదంతాన్ని పోలీసులకు తెలియజేశాడు. వివరాలను విశాఖ డీసీపీ-1 విద్యాసాగర్‌నాయుడు శనివారం వెల్లడించారు. అనకాపల్లి జిల్లా పరవాడ ప్రాంతానికి చెందిన గోపాల్‌ పెయింటింగ్‌ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. గోపాల్‌కు గతంలో అదే ప్రాంతానికి చెందిన వివాహిత శ్రావణి (28)తో పరిచయమేర్పడింది. ఆమె విశాఖ జగదాంబ కూడలిలోని ఓ దుకాణంలో పనిచేస్తున్నారు. భర్తతో విభేదాల కారణంగా దూరం ఉంటూ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆరు నెలలుగా గోపాల్‌తో కలిసి జీవిస్తున్నారు. తన స్నేహితుడైన వెంకటేష్‌ అలియాస్‌ వెంకిని శ్రావణికి ఇటీవల గోపాల్‌ పరిచయం చేశాడు. శ్రావణి ఆయనతో తరచూ ఫోన్‌లో మాట్లాడటం నచ్చని గోపాల్‌.. శ్రావణితో గొడవ పడ్డాడు. దీనిపై మాట్లాడుకుందామని చెప్పి శ్రావణి, వెంకటేష్‌, గోపాల్‌ ఒకే వాహనంపై శుక్రవారం రాత్రి ఆర్‌కే బీచ్‌కు వెళ్లారు. అక్కడ వారు మాట్లాడుకుంటుండగా పోలీసులు గమనించి పంపించేయటంతో పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ భవనం వెనక్కి వెళ్లిపోయారు. శ్రావణితో ఒంటరిగా మాట్లాడాలని గోపాల్‌ కోరటంతో వెంకటేష్‌ కాస్త దూరం వెళ్లారు. ఈ సమయంలో వెంకటేష్‌తో చనువుగా ఉండటంపై శ్రావణి, గోపాల్‌ల మధ్య వాగ్వాదమేర్పడింది. గోపాల్‌ కోపోద్రిక్తుడై ఆమె గొంతు నులిమి హతమార్చాడు. విగతజీవిగా పడి ఉన్న శ్రావణిని అక్కడే విడిచిపెట్టి ఇప్పుడే వస్తానంటూ వెంకటేష్‌తో చెప్పి నేరుగా గాజువాక పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని