పిడుగుపాటుకు ఇద్దరి దుర్మరణం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం వెల్గొండకు చెందిన నాగయ్య ఆదివారం ఖానాపూర్‌లోని తమ పొలంలో వరిపంట కోసేందుకు తన కుమారుడు రమేశ్‌, అల్లుడు కృష్ణతో కలిసి వెళ్లారు.

Published : 22 May 2023 05:36 IST

బిజినేపల్లి, వనపర్తి న్యూటౌన్‌- న్యూస్‌టుడే: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం వెల్గొండకు చెందిన నాగయ్య ఆదివారం ఖానాపూర్‌లోని తమ పొలంలో వరిపంట కోసేందుకు తన కుమారుడు రమేశ్‌, అల్లుడు కృష్ణతో కలిసి వెళ్లారు. వర్షం కురవడంతో తలదాచుకునేందుకు ట్రాక్టర్‌ వద్దకు వెళ్లగా పిడుగుపడి రమేశ్‌(24) అక్కడికక్కడే మృతి చెందారు. నాగయ్య, కృష్ణలకు గాయాలు కాగా వారిని జిల్లాఆసుపత్రికి తరలించారు. నాగయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ తీసుకెళ్లారు.

* వనపర్తి జిల్లా కిష్టగిరికి చెందిన పద్మ(48) తన పొలంలో పిడుగుపాటుకు గురై మరణించారు. భర్తతో కలిసి గ్రామ శివారు వ్యవసాయ పొలం వెళ్లగా సాయంత్రం ఈదురుగాలులతో వర్షం మొదలైంది. ఆమె తలదాచుకోవడానికి పొలంలోని గుడిసెలోకి వెళ్లగా దానిపై పిడుగుపడటంతో అది కుప్పకూలింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

వడదెబ్బతో ఇద్దరు..

దుగ్గొండి, చర్ల- న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఆదివారం వడదెబ్బ బారిన పడి ఇద్దరు మరణించారు. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురంలో మధ్యాహ్నం వడదెబ్బతో కాజీపేట ఇందిరమ్మ కాలనీకి చెందిన పెరుమాండ్ల కుమారస్వామి(55) అనే ఆటోడ్రైవర్‌ చనిపోయారు. ఆయన వరంగల్‌ నుంచి తన ఆటోలో ప్రయాణికులను లక్ష్మీపురానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో దాహం దాహం అంటూ ఆటోలోనే కుప్పకూలారు. గ్రామస్థులు నీరు తాగించి ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పెద్దిపల్లికి చెందిన కణితి లక్షీనర్సు(65) అనే వృద్ధుడు వడదెబ్బతో చనిపోయారు. ఉదయం నుంచి అలసటగా ఉందని చెబుతూ.. ఆయన ఒక్కసారిగా ఇంట్లో పడిపోయి మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని