రసాయన కర్మాగారంలో విష వాయువుల కలకలం

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట జాతీయ రహదారిపై ఉన్న ఆటోనగర్‌లోని ఎస్‌ఎల్‌ రసాయన కర్మాగారం నుంచి విడుదలైన విష వాయువుల ప్రభావానికి ముగ్గురు కార్మికులు స్పృహ కోల్పోవడంతో కలకలం రేగింది.

Published : 28 May 2023 06:04 IST

అపస్మారక స్థితిలో ముగ్గురు కార్మికులు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట జాతీయ రహదారిపై ఉన్న ఆటోనగర్‌లోని ఎస్‌ఎల్‌ రసాయన కర్మాగారం నుంచి విడుదలైన విష వాయువుల ప్రభావానికి ముగ్గురు కార్మికులు స్పృహ కోల్పోవడంతో కలకలం రేగింది. కర్మాగారంలో పని చేస్తున్న కార్మికులు పలువురు శనివారం ఉదయం సిలిండర్‌ నుంచి లీకైన టాలినిస్టా అనే రసాయనాన్ని పీల్చి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో బాపట్ల జిల్లా కొత్తూరు మండలం గాజువాక గ్రామానికి చెందిన పి.శివప్రసాద్‌తో పాటు అస్సాం రాష్ట్రానికి చెందిన రహమాన్‌, అబీబ్‌లు ఉన్నారు. వీరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. ముగ్గురు స్పృహ తప్పడంతో విడుదలైన వాయువు ప్రమాదకరమైందని తెలిసి కార్మికులు తీవ్ర ఆందోళన చెందారు. ముగ్గురినీ జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా, ప్రథమ చికిత్స అనంతరం విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో స్థానిక సర్కిల్‌ పోలీసులు కర్మాగారాన్ని పరిశీలించారు. ఆర్డీవో రవీంద్రరావు వివిధ శాఖల అధికారులతో కలిసి కర్మాగారాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంఘటనకు దారి తీసిన కారణాలపై పరిశీలన చేసి, అవసరమైతే యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇతర అన్ని కర్మాగారాల్లో కూడా తనిఖీలు చేయాలని స్థానిక తహసీల్దారు నాగరాజు సహా ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతానికి కర్మాగారాన్ని పూర్తిగా నిలిపివేశామని, అస్వస్థతకు గురైన వారి రక్తం నమూనాల నివేదికలు వచ్చిన తరువాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని