AC Blast: ఇంట్లో ఏసీ పేలి మహిళా ఉద్యోగి మృతి

విద్యుత్తు హైవోల్టేజీతో ఏసీ పేలి ఓ మహిళా ఉద్యోగి మృతి చెందిన విషాద ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తిలో చోటుచేసుకుంది.

Updated : 31 May 2023 06:58 IST

చీమకుర్తి, న్యూస్‌టుడే: విద్యుత్తు హైవోల్టేజీతో ఏసీ పేలి ఓ మహిళా ఉద్యోగి మృతి చెందిన విషాద ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తిలో చోటుచేసుకుంది. దామర్ల శ్రీదేవి(52) అనే మహిళ భర్త వెంకట సుబ్బారావు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన శ్రీదేవి ఒంగోలు జడ్పీ కార్యాలయంలోని పీఎఫ్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. తన కుమారుడు సాయితేజతో కలిసి చీమకుర్తి పట్టణంలోని పల్లపోతు వారి వీధిలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 28వ తేదీ రాత్రి తల్లీకుమారులిద్దరూ ఇంట్లో నిద్రించారు. ఈ సమయంలో అధిక వోల్టేజీతో విద్యుత్తు సరఫరా కావడంతో తీగలు కాలిపోయి ఏసీ పేలిపోయింది. నిద్రలోనే ఉన్న తల్లీ కుమారులిద్దరూ ఏసీ నుంచి విడుదలైన వాయువులను పీల్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు శ్రీదేవి, సాయితేజలను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని