ప్రశ్నపత్రాల లీకేజి కుంభకోణం రూ.కోట్లలోనే..!

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజి కుంభకోణం విలువ రూ.కోట్లలోనే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Updated : 01 Jun 2023 05:12 IST

100 మందికి పైగా నిందితులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజి కుంభకోణం విలువ రూ.కోట్లలోనే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులు కూడా వందమందికి పైగా ఉంటారని.. వీరందరి అరెస్టు తప్పదని సమాచారం. లోతుగా దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెల్లడవుతుండటం అధికారులనూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టీఎస్‌పీఎస్సీలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డి, కార్యదర్శి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్‌లు కలిసి ప్రశ్నపత్రాలు చోరీ చేశారు. ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్‌ రూ.10 లక్షలకు డాక్యా నాయక్‌కు అమ్మాడు. డాక్యానాయక్‌ దీన్ని మరో 13 మందికి విక్రయించాడు. ఇలా దాదాపు రూ.40 లక్షలు చేతులు మారినట్లు మొదట్లో భావించారు. మార్చి 12న జరగాల్సిన టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పరీక్ష లీకైనట్లు సమాచారం రావడంతో దర్యాప్తు మొదలైంది. కమిషన్‌ అప్పటికే గ్రూప్‌-1, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌, సీడీపీవో, సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-1, ఏఈఈ, డివిజనల్‌ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో), ఏఈ పరీక్షలు నిర్వహించింది. వీటిలో సీడీపీవో, సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-1, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ పరీక్షలు మినహా మిగతా నాలుగు పరీక్షలను రద్దు చేసింది. అంటే ఈ నాలుగు పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయన్నమాట.

అంచెలంచెలుగా చేతులు మారి..

చోరీ చేసిన ప్రశ్నపత్రాలను ప్రవీణ్‌, రాజశేఖర్‌ ముఠా రకరకాలుగా అమ్ముకుంది. రూ.లక్షలు పెట్టి ప్రశ్నపత్రం కొనుక్కున్న వారంతా ఇతరులకు విక్రయించి.. తమ సొమ్మును రాబట్టుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డిలను పోలీసులు ఎంత ప్రశ్నించినా సరైన సమాచారం రాలేదు. తమ వద్ద ప్రశ్నపత్రాలు కొన్నవారి వివరాలు మాత్రమే చెప్పగలిగారు. వారి వద్ద కొనుగోలు చేసిన అభ్యర్థులు మరికొందరికి, వారు ఇంకొందరికి అమ్మారు. గొలుసుకట్టుగా మారిన ఈ కుంభకోణాన్ని ఛేదించడం పోలీసులకు కష్టంగా మారింది. మొదట్లో ప్రవీణ్‌, రాజశేఖర్‌, డాక్యానాయక్‌ల ద్వారా ప్రశ్నపత్రాలు 20 మందికి మాత్రమే చేరి ఉండవచ్చని భావించారు. కాని ఇప్పటికే అవి 40 మందికి చేరగా వీరిలో చాలామంది వివరాలు ప్రవీణ్‌, రాజశేఖర్‌లకు కూడా తెలియవు. ఉదాహరణకు ప్రవీణ్‌ తన స్నేహితుడైన సురేష్‌కు గ్రూప్‌-1, ఏఈ ప్రశ్నపత్రాలు ఇచ్చాడు. సురేష్‌ గ్రూప్‌-1 పరీక్ష రాశాడు. ఏఈ ప్రశ్నపత్రం మాత్రం 78 మందికి విక్రయించినట్లు గుర్తించారు. సురేష్‌ ద్వారా ప్రశ్నపత్రం తీసుకున్న విద్యుత్తుశాఖ ఏఈ రమేష్‌ మరో 30 మందికి దీన్ని అమ్మాడు. ఇలా అంచెలంచెలుగా ఇది అనేక చేతులు మారింది. ఈ నేపథ్యంలోనే కుంభకోణం విలువ రూ. కోట్లకు చేరవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు