అంగన్‌వాడీ టీచర్‌ దారుణ హత్య

అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్న 50 ఏళ్ల మహిళను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపిన ఉదంతమిది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెంలో ఈ దారుణం సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

Published : 06 Jun 2023 02:46 IST

ప్రకాశం జిల్లాలో ఘటన
వైకాపా నాయకుడే ట్రాక్టర్‌తో తొక్కించి చంపాడు
నీ భర్త తెదేపాలో ఉన్నాడు.. చంపే వరకు నిద్రపోనని ముందే హెచ్చరించాడు
మృతురాలి భర్త, కుమార్తె ఆరోపణ

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు - న్యూస్‌టుడే, టంగుటూరు: అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్న 50 ఏళ్ల మహిళను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపిన ఉదంతమిది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెంలో ఈ దారుణం సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ‘నీ భర్త తెదేపాలో ఉన్నాడు. ఆ పార్టీ ఎమ్మెల్యే వెంట తిరుగుతున్నాడు. నువ్వేమో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్నావు. మీ ఇద్దరిలో ఎవరో ఒకర్ని చంపే వరకు నేను నిద్రపోను’.. అని రెండు రోజుల కిందట స్థానిక వైకాపా నాయకుడు సవలం కొండలరావు హెచ్చరించాడని, ఆయనే ఇంటి వద్ద ఉన్న హనుమాయమ్మ (50)ను ట్రాక్టర్‌తో ఢీకొట్టి హతమార్చాడని మృతురాలి భర్త సవలం సుధాకర్‌, కుమార్తె మాధురి ఆరోపించారు. వారి కథనం ప్రకారం వివరాలివీ.. టంగుటూరు మండలం రావివారిపాలేనికి చెందిన సవలం సుధాకర్‌ తెదేపా ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి అనుచరుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సుధాకర్‌ భార్య హనుమాయమ్మ అదే గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌. స్థానిక వైకాపా నాయకుడు సవలం కొండలరావు, సుధాకర్‌ కుటుంబాల మధ్య పొలం తగాదాలున్నాయి. అదే సమయంలో తెదేపాలో సుధాకర్‌ ఎదుగుదలను ఆయన జీర్ణించుకోలేకపోయాడు. రెండు రోజుల క్రితం హనుమాయమ్మ వద్దకు వచ్చి ఇద్దరిలో ఎవరో ఒకరిని చంపుతానంటూ హెచ్చరించాడు. ఇదిలా ఉండగా సోమవారం వైకాపా నియోజకవర్గ బాధ్యుడు వరికూటి అశోక్‌బాబు తూర్పునాయుడుపాలెంలోని ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టారు. దీన్నిఅడ్డుకునేందుకు తెదేపా శ్రేణులతోపాటు సుధాకర్‌ ఉదయాన్నే తూర్పునాయుడుపాలెం వెళ్లారు.

ఢీకొట్టి, ట్రాక్టర్‌ గొర్రుతో తొక్కించి..

ఉదయం అంగన్‌వాడీ పాఠశాలకు వెళ్లిన హనుమాయమ్మ.. మధ్యాహ్న సమయంలో ఇంటికి వచ్చారు. ఇంటి ఎదుట రహదారి పక్కన నిల్చుని కుమార్తె మాధురిని మంచినీళ్లు తేవాలని పిలిచారు. ఆమె నీళ్లు తెచ్చి తల్లికిచ్చి తిరిగి లోపలికి వెళ్లారు. ఇంటి గోడ పక్కన నిల్చుని మంచినీళ్లు తాగుతున్న హనుమాయమ్మను అప్పటికే అక్కడ ట్రాక్టర్‌తో వేచి ఉన్న సవలం కొండలరావు వేగంగా వెనక్కి వచ్చి గొర్రుతో ఢీకొట్టాడు. కింద పడిన ఆమె ఇంకా ప్రాణాలతో ఉందేమో అనే అనుమానంతో మరోసారి ట్రాక్టర్‌తో తొక్కించాడు. దూరం నుంచి దీన్ని గమనించిన కుమార్తె మాధురి కేకలు వేస్తూ ట్రాక్టర్‌ను వెంబడించే ప్రయత్నం చేయగా.. అక్కడే ఉన్న కొండలరావు బంధువులు మహేష్‌, రమణమ్మ, ఆదిలక్ష్మమ్మ ఆమెను అడ్డుకుని కొట్టారు. ట్రాక్టర్‌తో ఢీకొట్టడంతో హనుమాయమ్మ ఇంటి ప్రహరీ కూడా ధ్వంసమైంది. సంఘటనా స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేశామని, అయితే పూర్తి వివరాలు తర్వాత చెబుతామని పోలీసులు పేర్కొనడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని