సహజీవనం చేస్తున్న మహిళ దారుణ హత్య

శ్రద్ధావాకర్‌ హత్య కేసును ఇంకా మర్చిపోకముందే మహారాష్ట్ర ఠాణె జిల్లాలో అంతకు మించిన దారుణం వెలుగుచూసింది.

Published : 09 Jun 2023 03:46 IST

ముక్కలుగా చేసి.. బకెట్‌లో దాచి..
మహారాష్ట్రలో ఓ వ్యక్తి ఘాతుకం

ఠాణె: శ్రద్ధావాకర్‌ హత్య కేసును ఇంకా మర్చిపోకముందే మహారాష్ట్ర ఠాణె జిల్లాలో అంతకు మించిన దారుణం వెలుగుచూసింది. నయా నగర్‌ పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం.. మనోజ్‌ సహానీ(56), సరస్వతి వైద్య(36) ముంబయి శివారులోని మీరా-భయందర్‌ ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో అద్దెకుంటూ గత మూడేళ్లుగా సహజీవనంలో ఉన్నారు. వారు ఉంటున్న ఇంటి నుంచి బుధవారం దుర్వాసన వస్తుండటంతో గుర్తించిన పొరుగింటివారు, హౌసింగ్‌ సొసైటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకోవడంతో సరస్వతి హత్య గురించి వెలుగులోకి వచ్చింది. ఆ ఇంట్లో మృతురాలి శరీర భాగాల ముక్కలను బకెట్‌, టబ్‌ల్లో పోలీసులు గుర్తించారు. దాదాపు నాలుగు రోజుల క్రితమే ఆమె హత్య జరిగినట్లు వారు అంచనా వేశారు. వారిద్దరి మధ్య జరిగిన గొడవే ఈ దారుణానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఈ హత్యను దాచిపెట్టేందుకు అతడు యత్నించాడని, దుర్వాసన రాకుండా రూమ్‌ ఫ్రెషనర్‌ను వాడినట్లు తెలిపారు. ఆమె శరీర భాగాల్లో కొన్నింటిని నిందితుడు కుక్కర్‌లో ఉడికించినట్లు, కాల్చినట్లు గుర్తించారు. మృతురాలి శరీరభాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మనోజ్‌.. బోరివాలీ ప్రాంతంలో ఓ రేషన్‌ దుకాణంలో పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు. మృతురాలు సరస్వతిని అనాథగా గుర్తించారు. మనోజ్‌ సహానీని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని