లేబర్‌ కార్డు ఇవ్వడానికీ లంచం!

ఆమె మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు డివిజన్‌ అసిస్టెంట్‌ లేబర్‌ అధికారిణి(ఏఎల్‌ఓ) పోలం సుమతి.. కూలీగా పనిచేసే ఓ నిరుపేద నుంచీ లంచం ఆశించారు.

Updated : 09 Jun 2023 05:17 IST

రూ.20 వేలు తీసుకుంటూ అనిశాకు చిక్కిన తొర్రూరు ఏఎల్‌ఓ

తొర్రూరు, న్యూస్‌టుడే: ఆమె మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు డివిజన్‌ అసిస్టెంట్‌ లేబర్‌ అధికారిణి(ఏఎల్‌ఓ) పోలం సుమతి.. కూలీగా పనిచేసే ఓ నిరుపేద నుంచీ లంచం ఆశించారు. చివరికి అవినీతి నిరోధక శాఖ(అనిశా-ఏసీబీ)కి దొరికిపోయారు. వరంగల్‌ రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ కె.సుదర్శన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడురు మండలం బావోజీతండాకు చెందిన ధరంసోతు నరేశ్‌ గతేడాది ఫిబ్రవరి 2న లేబర్‌ గుర్తింపు కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌ పూర్తయి కార్డు మంజూరైంది. కానీ, అప్పట్లో అతను తీసుకోలేదు. గతేడాది డిసెంబరు 8న నరేశ్‌ ప్రమాదవశాత్తు మృతి చెందారు. లేబర్‌ కార్యాలయం నుంచి రావాల్సిన ప్రమాద బీమా డబ్బుల కోసం అతని గుర్తింపు కార్డు అవసరమైంది. దాని కోసం నరేశ్‌ తండ్రి ధరంసోతు వెంకన్న పలుమార్లు తొర్రూరు ఏఎల్‌వో సుమతిని కలిసి అభ్యర్థించారు. ఆమె కాలయాపన చేస్తూ.. ఇబ్బందులకు గురిచేశారు. చివరకు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతమొత్తం ఇచ్చుకోలేనని వెంకన్న చెప్పడంతో ముందు రూ.20 వేలు ఇవ్వాలని, బీమా సొమ్ము వచ్చాక మిగిలిన రూ.10 వేలు ఇవ్వాలని షరతు విధించారు. దీంతో వెంకన్న గత నెల 31న అనిశాను ఆశ్రయించారు. గురువారం మధ్యాహ్నం తొర్రూరు ఏఎల్‌వో కార్యాలయంలో సుమతికి వెంకన్న రూ.20 వేలు ఇవ్వగానే అక్కడే ఉన్న అనిశా అధికారులు పట్టుకున్నారు. ఆమెను హైదరాబాద్‌ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. దాడిలో అనిశా ఇన్‌స్పెక్టర్లు శ్యాంసుందర్‌, రవి, సిబ్బంది పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు