Crime News: శంషాబాద్‌లో చంపి.. సరూర్‌నగర్‌ మ్యాన్‌హోల్‌లో పడేశాడు..

శంషాబాద్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. 

Updated : 09 Jun 2023 13:49 IST

హైదరాబాద్‌ : శంషాబాద్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఆమెను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సరూర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన వెంకట సాయికృష్ణ,  అప్సర బంధువులు. సాయికృష్ణకు ఇప్పటికే వివాహమై.. ఇద్దరు పిల్లలున్నారు. అయితే.. అప్సరతో సాయికృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని అప్సర అతడిపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే.. వీరిద్దరూ రెండ్రోజుల కిందట కారులో శంషాబాద్‌లోని సుల్తాన్‌పల్లికి వెళ్లారు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సాయికృష్ణ.. ఆమె తలపై బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం తన కారులోనే ఆమె మృతదేహాన్ని సరూర్‌నగర్‌కు తీసుకువచ్చాడు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద మ్యాన్‌హోల్‌లో పడేశాడు. అక్కడి నుంచి శంషాబాద్‌ తిరిగి చేరుకొని.. ఏమీ ఎరగనట్లు తన బంధువు అప్సర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. సాయికృష్ణ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌తోపాటు.. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కేసును పోలీసులు ఛేదించారు. సాయికృష్ణే.. అప్సరను అంతమొందించాడని తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. మ్యాన్‌హోల్‌లో మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఘటనాస్థలిలో తహశీల్దార్‌ పంచనామా నిర్వహించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని