మద్యానికి బానిసైన కుమారుడికి తల్లిదండ్రుల మరణశాసనం

కొడుకు మద్యానికి బానిసై, కుటుంబ బాధ్యతలను గాలికొదిలేశాడు. అక్కడితో ఆగకుండా తన జల్సాలకు ఇంటిని అమ్మేయాలంటూ తల్లిదండ్రులను మానసికంగా హింసించాడు.

Updated : 26 Sep 2023 08:32 IST

హంతకులకు రూ.3 లక్షల సుపారీ ఇచ్చి మరీ మట్టుబెట్టిన దారుణం

ఎటపాక, న్యూస్‌టుడే: కొడుకు మద్యానికి బానిసై, కుటుంబ బాధ్యతలను గాలికొదిలేశాడు. అక్కడితో ఆగకుండా తన జల్సాలకు ఇంటిని అమ్మేయాలంటూ తల్లిదండ్రులను మానసికంగా హింసించాడు. దీంతో ఆ కన్నవారి గుండె మండిపోయింది. కుమారుడు ఇక దారికి రాడనుకుని మనసు చంపుకొని ఊపిరి తీయాలనుకున్నారు. సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించారు. మత్తుకు బానిసైన వ్యక్తి.. కుటుంబం కకావికలం కావడానికి ఎలా కారకుడవుతాడనే దానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లో ఈ నెల 10న హత్య జరిగింది. సోమవారం ఎటపాక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రంపచోడవరం ఓఎస్డీ కె.వి.మహేశ్వరరెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

తెలంగాణలోని భద్రాచలం మెడికల్‌ కాలనీకి చెందిన పగిల్ల రాము (57), సావిత్రి (55)ల కుమారుడు దుర్గాప్రసాద్‌ (35). రోజూ మద్యం తాగి ఇంటికొచ్చి కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఉండేవాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయి భార్య మౌనిక పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా అతడు తన తీరు మార్చుకోకుండా ఇంటిని అమ్మేయాలని తల్లిదండ్రులను హింసించేవాడు. కొడుకు పెడుతున్న బాధలు చాలా రోజుల పాటు తట్టుకున్న వారిలో చివరకు సహనం నశించింది. కొడుకును అంత మొందించేందుకు భద్రాచలానికే చెందిన గుమ్మడి రాజు (33), షేక్‌ ఆలీ పాషా (32)లకు రూ.3 లక్షల సుపారీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారు.

పథకం ప్రకారం ఈ నెల 9న అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న దుర్గాప్రసాద్‌ను సుపారీ వ్యక్తులు, తల్లిదండ్రులు కలిసి కత్తితో మెడ కోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని తుమ్మలనగర్‌ అటవీ ప్రాంతానికి ఆటోలో తీసుకొచ్చి గానుగచెట్ల తోటలో పెట్రోలు పోసి తగులబెట్టారు. ఆ తరవాత నలుగురూ ఊరొదిలి పరారయ్యారు. 10వ తేదీ మధ్యాహ్నం అటవీ ప్రాంతానికి పుల్లల కోసం వెళ్లిన వ్యక్తికి కాలిపోయిన శవం కనిపించింది. దర్యాప్తు ప్రారంభించిన ఎటపాక పోలీసులు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల్లో మృతదేహం ఫొటోతో కరపత్రాలు వేశారు. తెలంగాణలో ఉంటున్న మృతుని భార్య ఆ ఫొటో తన భర్తదేనని గుర్తుపట్టి పోలీసులను ఆశ్రయించడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. అతడి తల్లిదండ్రులు, నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు