ఏసీబీ వలలో జనగామ మున్సిపల్‌ కమిషనర్‌

జనగామ మున్సిపల్‌ కమిషనర్‌ రజిత సోమవారం రూ.40 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డారు. వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం..

Published : 21 Nov 2023 04:42 IST
జనగామ, న్యూస్‌టుడే: జనగామ మున్సిపల్‌ కమిషనర్‌ రజిత సోమవారం రూ.40 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డారు. వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం బండ్లగూడెంకు చెందిన చెట్టిపల్లి రాజు గత ఏడాది జూన్‌లో జనగామ కలెక్టరేట్‌ ఎదుట జీప్లస్‌-3 భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో నిర్మాణాన్ని పూర్తిచేశారు. నిబంధనల ప్రకారం 10 శాతం స్థలాన్ని మున్సిపాల్టీకి మార్ట్‌గేజ్‌ చేశారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత మున్సిపల్‌ పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ సైతం తీసుకున్నారు.
మున్సిపాల్టీకి కుదువ పెట్టిన 10 శాతం స్థలాన్ని విడిపించి ఇవ్వాలని కమిషనర్‌ రజితకు దరఖాస్తు చేశారు. స్థలాన్ని విడిపించేందుకు రూ.60 వేలు ఇవ్వాలని కమిషనర్‌ అడగ్గా రాజు రూ.40 వేలు ఇస్తానన్నారు. దీనిపై ఆయన ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచనల మేరకు రాజు రూ.40 వేలు తీసుకెళ్లగా తన డ్రైవర్‌ నవీన్‌కు ఇవ్వాలని రజిత సూచించారు. నవీన్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కమిషనర్‌ ఆదేశాల మేరకే తాను డబ్బులు తీసుకున్నట్లు డ్రైవర్‌ అంగీకరించాడు. కమిషనర్‌ రజితను, డ్రైవర్‌ నవీన్‌ను కస్టడీలోకి తీసుకున్నామని, వారిని విచారించి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సోదాల్లో డీఎస్పీతో పాటు ఇన్‌స్పెక్టర్లు శ్యామ్‌, రవి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని