TS News: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడులో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 15 Jul 2021 06:45 IST

ఉద్యోగ ప్రకటనలు వెలువడక పోవడంతో ఒత్తిడికి గురయ్యాడన్న కుటుంబసభ్యులు

పెనుబల్లి, న్యూస్‌టుడే: మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడులో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగదేవిపాడుకు చెందిన సానిక నాగేశ్వరరావు(29) 2015లో ఎం.ఎ. ఎకనామిక్స్‌ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు రెండేళ్లపాటు హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంటి వద్ద ఉంటూ సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని మనస్తాపం చెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉన్న కలుపు మందును బయటికి తీసుకెళ్లి తాగాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు వెతికారు. ఊరిబయట ఉన్న జామాయిల్‌ చెట్లలో నాగేశ్వరరావు పడిపోయి ఉండటంతో వెంటనే పెనుబల్లి వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఉద్యోగ ప్రకటనలు వెలువడకపోవడంతో ఒత్తిడికి గురై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం పెనుబల్లి వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని