ప్రేమించలేదనే ఘాతుకం

తనను ప్రేమించడం లేదని బీటెక్‌ విద్యార్థిని రమ్యను (20) నిందితుడు శశికృష్ణ హతమార్చాడని గుంటూరు రేంజి ఇన్‌ఛార్జి డీఐజీ రాజశేఖర్‌బాబు తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో దళిత విద్యార్థిని హత్యకు ...

Published : 17 Aug 2021 04:13 IST

రమ్య హత్య కేసు నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేశాం

ఇన్‌ఛార్జి డీఐజీ రాజశేఖర్‌బాబు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: తనను ప్రేమించడం లేదని బీటెక్‌ విద్యార్థిని రమ్యను (20) నిందితుడు శశికృష్ణ హతమార్చాడని గుంటూరు రేంజి ఇన్‌ఛార్జి డీఐజీ రాజశేఖర్‌బాబు తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో దళిత విద్యార్థిని హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన తెలిపారు. తొమ్మిదో తరగతి చదివి కొన్నాళ్లు మెకానిక్‌గా పని చేసిన కుంచాల శశికృష్ణకు 6 నెలల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో రమ్య పరిచయమైందని వివరించారు. ఆమె కళాశాలవద్ద, గుంటూరు బస్టాండ్‌వద్ద కలుస్తూ ప్రేమించమంటూ తరచూ వేధిస్తుండటంతో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను రమ్య బ్లాక్‌ చేశారని తెలిపారు. 2 నెలలుగా దూరం పెట్టారని వివరించారు. తనను పట్టించుకోకుండా మరొకరితో స్నేహంగా మెలుగుతోందని అనుమానిస్తూ శశికృష్ణ ఆమెపై కక్ష పెంచుకున్నాడని, ఈ క్రమంలోనే ఆదివారం యువతిని హత్య చేశాడని వివరించారు. ‘నరసరావుపేట రూరల్‌ ములకలూరు గ్రామంలోని పొలాల్లో నిందితుడున్నాడనే సమాచారంతో పోలీసులు వెళ్లారు. అతన్ని పట్టుకునే క్రమంలో అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు పట్టుకుని ఆసుపత్రికి తరలించారు. అర్బన్‌ పోలీసులు చాకచక్యంగా నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేశారు. పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని తరలిస్తున్నప్పుడు కొన్ని రాజకీయ పక్షాలు అడ్డుకోవడం, పోలీసులపై దురుసుగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని రాజశేఖర్‌బాబు స్పష్టం చేశారు.

దళిత కుటుంబంనుంచి వచ్చిన అధికారిని: విశాల్‌ గున్నీ

‘మృతురాలి నివాసం వద్ద పరిస్థితి అదుపు తప్పినప్పుడు అందరికీ సర్ది చెబుతున్నప్పుడు మాజీ మంత్రి ఆనందబాబుపై చేయి చేసుకున్నానంటూ కొన్ని మాధ్యమాల్లో రావడం బాధాకరం. కులమతాలకు అతీతంగా సేవ చేస్తుంటా. తప్పనిసరి పరిస్థితుల్లో చెబుతున్నా.. కర్ణాటకలోని దళిత కుటుంబానికి చెందిన పోలీసు అధికారిగా రాజ్యాంగబద్ధంగా పని చేస్తున్నా. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఏ పార్టీ వారైనా చర్యలు తీసుకుంటాం. ఈరోజు తోపులాటలో నాకు దెబ్బలు తగిలాయి. విధుల్లో ఇవన్నీ సాధారణమేననుకుని పని చేశా’ అని రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని