Crime News: కాబోయే భార్యనే కడతేర్చాలని.. అనుమానంతో యువకుడి ఘాతుకం

రెండేళ్లుగా ప్రేమించుకున్నారు.. పెద్దల అంగీకారంతో కొద్దిరోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇంతలో అనుమానం పెనుభూతమై చిచ్చురేపింది. ప్రియురాలిపై ప్రియుడు పెట్రోలు పోసి నిప్పంటించాడు. ప్రేయసితో పాటు ఆమె సోదరి, ఆరేళ్ల బాలుడు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో ఈ దారుణం చోటుచేసుకుంది. శ్రీకాకుళంజిల్లా రణస్థలం మండలం నారువకి చెందిన వాళ్లె రాంబాబు(24), పూసపాటిరేగ మండలం చౌడువాడకు చెందిన గాలి రాములమ్మ (22) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు పెళ్లికి అంగీకరించారు. అక్టోబరులో పెళ్లి చేద్దామని ఏర్పాట్లు చేసుకున్నారు.

Updated : 21 Aug 2021 07:34 IST

యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు

మంటల్లో చిక్కుకున్న యువతి సోదరి, ఆమె కుమారుడు

విజయనగరం-ఈటీవీ, నేరవార్తా విభాగం, పూసపాటిరేగ, న్యూస్‌టుడే: రెండేళ్లుగా ప్రేమించుకున్నారు.. పెద్దల అంగీకారంతో కొద్దిరోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇంతలో అనుమానం పెనుభూతమై చిచ్చురేపింది. ప్రియురాలిపై ప్రియుడు పెట్రోలు పోసి నిప్పంటించాడు. ప్రేయసితో పాటు ఆమె సోదరి, ఆరేళ్ల బాలుడు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో ఈ దారుణం చోటుచేసుకుంది. శ్రీకాకుళంజిల్లా రణస్థలం మండలం నారువకి చెందిన వాళ్లె రాంబాబు(24), పూసపాటిరేగ మండలం చౌడువాడకు చెందిన గాలి రాములమ్మ (22) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు పెళ్లికి అంగీకరించారు. అక్టోబరులో పెళ్లి చేద్దామని ఏర్పాట్లు చేసుకున్నారు.

అక్కడి నుంచి అనుమానం

ఇంతలో రాములమ్మ వేరే యువకుడితో మాట్లాడుతోందని రాంబాబు ఆమెపై అభాండాలు వేశాడు. పెళ్లికి నిరాకరించడంతో రాములమ్మ తల్లిదండ్రులు రాంబాబు కుటుంబసభ్యులతో మాట్లాడినా సయోధ్య కుదరలేదు. పది రోజుల క్రితం పెద్దల సమక్షంలో పోలీసులు రాజీ కుదర్చడంతో రాంబాబు పెళ్లికి అంగీకరించాడు. ఇంతలో గురువారం అర్ధరాత్రి యువతి ఇంటికి వచ్చి నిద్రిస్తున్న రాములమ్మపై పెట్రోలు పోసి నిప్పంటించి, అక్కడ నుంచి పరారయ్యాడు. మంటల్లో చిక్కుకున్న రాములమ్మ దుప్పటి విసిరేయగా, అది పక్కనే ఉన్న సోదరి సంతోషి, ఆమె కుమారుడు అరవింద్‌ మీద పడి, వాళ్లకూ మంటలు అంటుకున్నాయి. వీరి కేకలు విని చుట్టుపక్కల వారు వచ్చి మంటలను అదుపు చేసి బాధితులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు.

‘దిశ’తో వేగంగా స్పందించాం: ఎస్పీ

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురినీ ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ పరామర్శించారు. ‘రాములమ్మ సోదరి ఫోన్లో దిశయాప్‌ బటన్‌ నొక్కడంతో పోలీసులు సకాలంలో వెళ్లి, వారికి మెరుగైన వైద్యం అందించడానికి వీలైంది. స్టేషన్‌కు 20 కి.మీ దూరంలో ఉన్న చౌడువాడకు 20 నిమిషాల్లో చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారు’ అని చెప్పారు.


బాధితులకు అండగా ఉంటాం: మంత్రులు

బాధితులకు అండగా ఉంటామని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. వారి ప్రాణాలకు ప్రమాదం లేదన్నారు. బాధితులను పరామర్శించారు. పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ఈ సమయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదన్నారు. బొత్స మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేసి, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధితులు కోలుకునేవరకూ ప్రభుత్వమే చూసుకుంటుందని, వారిని విశాఖ స్టీల్‌ప్లాంటులో ఉన్న బర్న్స్‌ వార్డుకు తరలించినట్లు తెలిపారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు.. రాములమ్మ కుటుంబానికి వైద్యం నిమిత్తం రూ.50 వేలు అందజేశారు.


మెరుగైన వైద్యం అందించాలి: సీఎం

ఈ ఘటనపై సీఎం జగన్‌ ఆరా తీశారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను విశాఖ తరలించాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలబడాలని, అందుతున్న వైద్యసేవలు పర్యవేక్షించాలని మంత్రి బొత్స సత్యనారాయణకు ముఖ్యమంత్రి సూచించారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని