Crime News: ఆస్తులు పంచలేదని.. ‘ఆటోమేటిక్‌’గా కొట్టేసింది 

ఉమ్మడి కుటుంబంలో సంసార బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ కోడలు.. తనపై అనుమానం రాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్తామామలకు చెందిన విలువైన నగలు, పత్రాలు దొంగిలించింది. దసరా పండక్కి అత్తమామలు...

Updated : 19 Oct 2021 13:05 IST

విలువైన వస్తువులు, పత్రాలు తస్కరించిన కోడలు 

ఛేదించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 

ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, నారాయణగూడ: ఉమ్మడి కుటుంబంలో సంసార బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ కోడలు.. తనపై అనుమానం రాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్తామామలకు చెందిన విలువైన నగలు, పత్రాలు దొంగిలించింది. దసరా పండక్కి అత్తమామలు హైదరాబాద్‌కు రాగానే... సునాయాసంగా తన పనిపూర్తి చేసింది.  నగరంలో ఉంటున్న కుమారుడికి అనుమానం వచ్చి సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మామ ఫోన్‌ను పరిశీలించారు. ఆయన ఫోన్‌లో ఓ మొబైల్‌యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి దాని ద్వారా కోడలే ఇదంతా చేసిందని పోలీసులు గుర్తించారు. కరీంనగర్‌లో జరిగిన ఈ నేరం వివరాలను సోమవారం నగరంలో సైబర్‌క్రైమ్‌ పోలీసు అధికారులు వెల్లడించారు. 

ఉమ్మడి కుటుంబంలో ఉండలేనని..  

కరీంనగర్‌లో ఉంటున్న వైకుంఠం (71)కు నలుగురు కుమారులున్నారు. తనవద్ద ఇద్దరు కుమారులు, కోడళ్లు ఉండగా... మరో ఇద్దరు  హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉండలేమని, ఆస్తి పంచాలని ఓ కోడలు కొద్దినెలలుగా తరచూ అత్తమామలతో గొడవపడుతుండేది. వారిని సూటిపోటి మాటలతో వేధిస్తుండేది. అత్తమామలకు బాధగా ఉన్నా.. పట్టించుకోకుండా ఇంట్లోనే ఉంటున్నారు. 

మామ ఫోన్‌కు ఆటోమేటిక్‌ కాల్‌ రికార్డింగ్‌..  

అత్తామామలపై కోపంతో ఉన్న కోడలు.. ఇంట్లోని అల్మారా, బీరువాలో దాచిన బంగారు ఆభరణాలు, ఆస్తిపత్రాలు  దొంగిలించాలని పథకం వేసింది. మూడునెలల క్రితం మామ ఫోన్‌లో ఆటోమేటిక్‌ కాల్‌ రికార్డింగ్‌యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి... తన గూగుల్‌డ్రైవ్‌కు అనుసంధానం చేసింది. అప్పటి నుంచి తన మామ ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ వింటోంది. దసరా పండుగకు బేగంపేటలో ఉన్న కుమారుడు రమ్మని వైకుంఠాన్ని పిలిచాడు. బీరువా, అల్మారా తాళాలు ఇంట్లోనే భద్రపరిచి రమ్మన్నాడు. దీంతో వైకుంఠం.. తాళాలను ఎక్కడ పెట్టిందీ కుమారుడికి ఫోన్‌లో చెప్పగా కోడలు విన్నది. అత్తమామలు హైదరాబాద్‌కు వెళ్లగానే  తాళాలను తీసుకుని విలువైన నగలు, పత్రాలను కొట్టేసింది. వైకుంఠం ఇంటికి వచ్చి పరిశీలించగా.. నగలు కనిపించలేదు. కోడలిని ప్రశ్నించగా.. తనకేమీ తెలీదంటూ చెప్పింది.  పోలీసులు విచారణ చేపట్టి అసలు విషయాన్ని బయటపెట్టారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని