తెదేపా సర్పంచి ఇంటిపై దాడి

తెదేపా సర్పంచి ఇంటిపై సోమవారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో వైకాపా నాయకులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు.

Updated : 30 Nov 2021 05:42 IST

తుమ్మలపాలెం (ప్రత్తిపాడు), న్యూస్‌టుడే: తెదేపా సర్పంచి ఇంటిపై సోమవారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో వైకాపా నాయకులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు, బాధితులు తెలిపిన మేరకు.. తెదేపా సర్పంచి చల్లా నాగమల్లేశ్వరి కుమారుడు హనుమంతు, మరికొందరు కలిసి ఆదివారం రాత్రి బొడ్డురాయి కూడలిలో మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో వైకాపాకు చెందిన కందుల గంగారావు, మరి కొందరు కలిసి ఆవైపు రాగా వాదన తలెత్తింది. కొద్దిసేపటికి మాటామాటా పెరిగి గొడవకు దిగారు. తర్వాత హనుమంతు బంధువుల ఇంటికి వెళ్లారు. వైకాపా నాయకుడు గంగారావు ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై హనుమంతు దాడిచేసి గాయపరిచారంటూ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన కొందరు వైకాపా వర్గీయులతో కలిసి సర్పంచి ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు.ఆవరణలోని కుర్చీలు, బెంచీ, ద్విచక్ర వాహనాన్ని కింద పడేసి తలుపులు బాదారు. ఆ సమయంలో ఇంట్లో సర్పంచి, ఆమె కోడలు దాక్షాయణి మాత్రమే ఉన్నారు. శబ్దానికి ఎవరూ అంటూ తలుపులు తీయగా.. హనుమంతు ఎక్కడున్నాడో చెప్పాలని, లేదంటే చంపేస్తామంటూ గంగారావు, ప్రతిమల శ్రీనివాసరావు అనే వ్యక్తి గొడ్డలి, గడ్డ పలుగు చూపించి బెదిరించారని సర్పంచి, ఆమె కోడలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సీహెచ్‌ పత్రాప్‌కుమార్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని