రూ.50 లక్షల కాంట్రాక్టులో.. రూ.25 లక్షలు కమీషన్‌ ఇవ్వాలట!

రైల్వేస్టేషన్‌లో పైవంతెన పనులు చేస్తున్న కూలీలు, పర్యవేక్షిస్తున్న సిబ్బందిపై కొందరు రాళ్లదాడికి పాల్పడటంతో పాటు వాహనాలు ధ్వంసం చేయడం కలకలం రేపింది. కాంట్రాక్టులో కమీషన్‌ ఇవ్వలేదన్న అక్కసుతో ఓ ప్రజాప్రతినిధి అనుచరులు ఈ దారుణానికి తెగబడినట్లు

Updated : 03 Dec 2021 07:00 IST

గుత్తేదారు సిబ్బందిపై ప్రజాప్రతినిధి అనుచరుల దాడి
రైల్వేస్టేషన్‌లోనే ఘటన.. కేసు నమోదు

దాడిలో గాయపడిన ఇంజినీరు నందకుమార్‌

ఈనాడు డిజిటల్‌, కర్నూలు: రైల్వేస్టేషన్‌లో పైవంతెన పనులు చేస్తున్న కూలీలు, పర్యవేక్షిస్తున్న సిబ్బందిపై కొందరు రాళ్లదాడికి పాల్పడటంతో పాటు వాహనాలు ధ్వంసం చేయడం కలకలం రేపింది. కాంట్రాక్టులో కమీషన్‌ ఇవ్వలేదన్న అక్కసుతో ఓ ప్రజాప్రతినిధి అనుచరులు ఈ దారుణానికి తెగబడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కర్నూలు జిల్లా మద్దికెరలో గురువారం జరిగిన ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్దికెర నుంచి బేతంచర్ల వరకు ఆరు రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు పట్టాలు దాటేందుకు పైవంతెనలు నిర్మిస్తున్నారు. బెంగళూరుకు చెందిన వీవీఆర్‌కే అసోసియేట్స్‌ సంస్థ రూ.20 కోట్లకు ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. మద్దికెర స్టేషన్‌లో పనులు చేస్తున్న గుత్తేదారు సిబ్బంది నుంచి రూ.25 లక్షలు ఇవ్వాలని ఓ ప్రజాప్రతినిధి అనుచరులు కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది.

పనుల పర్యవేక్షకుడి (మాలధారణ)తో మాట్లాడుతున్న ప్రజాప్రతినిధి అనుచరులు

వీడియో రికార్డింగ్‌తో గుట్టు బయటకు!

పనులు జరుగుతున్న ప్రదేశానికి వచ్చిన పది మంది దుండగులు ఒక్కసారిగా కూలీలు, సిబ్బందిపై రాళ్లతో విరుచుకుపడ్డారు. ఇంజినీర్‌ నందకుమార్‌, సూపర్‌వైజర్‌ కృష్ణయ్యలకు గాయాలయ్యాయి. తమిళనాడుకు చెందిన కూలీలు తలోదిక్కున పారిపోయారు. అక్కడే ఉన్న కారును, సిమెంటు మిశ్రమం కలిపే లారీని తీసుకెళ్లి కిలోమీటరు దూరంలో రోడ్డు పక్కన వదిలేశారు. పొక్లెయిన్‌ తాళాలు లాక్కొనేందుకు యత్నించగా.. స్థానికుడైన వాహన యజమాని బతిమాలడంతో వదిలేశారు. దాడికి పురిగొల్పిన వారిలో కొందరు కాసేపటికే గుత్తేదారు సంస్థ సూపర్‌వైజర్‌తో చర్చించడానికి మళ్లీ స్టేషన్‌కు వచ్చారు. ‘మేం చేస్తున్న సబ్‌ కాంట్రాక్టు పనివిలువ రూ.2.50 కోట్లు కాదు. రూ.50 లక్షలు మాత్రమే’నని అయ్యప్ప మాలధారణలో ఉన్న సూపర్‌వైజర్‌ సముదాయించేందుకు యత్నించారు. అయినా వినని దుండగులు.. ‘ఇలాంటప్పుడు కలిస్తే సరిపోతుంది. వాళ్లని కలవడానికి ఏం బరువా ఏంటి? ఫోన్‌ నంబరు ఇచ్చాంగా.. ముందు మాట్లాడండి’ అంటూ బెదిరించారు. అక్కడే ఉన్న గుత్తేదారు సిబ్బంది ఈ సంభాషణను రికార్డు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో.. దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. సంస్థ మేనేజర్‌ నందకిశోర్‌ ఫిర్యాదు మేరకు ఎస్సై మమత ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని