TS News: పసితనంలో అంగవికలురాలిని చేశాడు.. ఆరేళ్లకు వాగులో పడేసి హతమార్చాడు

తన కారణంగానే కాళ్లు చచ్చుపడిపోయిన కన్నబిడ్డపై ఏమాత్రం కనికరం చూపకుండా వాగులో పడేసి ప్రాణం తీశాడు ఓ తండ్రి. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం సూరారంలో బుధవారం ఈ అమానవీయ ఘటన వెలుగుచూసింది.

Updated : 06 Jan 2022 12:08 IST

బాలానగర్‌, న్యూస్‌టుడే: తన కారణంగానే కాళ్లు చచ్చుపడిపోయిన కన్నబిడ్డపై ఏమాత్రం కనికరం చూపకుండా వాగులో పడేసి ప్రాణం తీశాడు ఓ తండ్రి. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం సూరారంలో బుధవారం ఈ అమానవీయ ఘటన వెలుగుచూసింది. జడ్చర్ల గ్రామీణ సీఐ జములప్ప, గ్రామస్థుల కథనం ప్రకారం.. ఇదే జిల్లా హన్వాడ మండల కేంద్రానికి చెందిన రావుల రాజు, నవాబ్‌పేట మండలం దేపల్లికి చెందిన మంజులకు 13 ఏళ్ల కిందట వివాహమైంది. అప్పటి నుంచి వీరు బాలానగర్‌ మండలం సూరారంలోనే ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. మూడో అమ్మాయి స్నేహ(6) పసితనంలో ఉండగా మంజులతో గొడవపడిన రాజు.. ఆ కోపంలో పాపను విసిరేశాడు. దీంతో ఆమె వెన్నుపూస విరిగి రెండు కాళ్లూ చచ్చుబడి పోయాయి. నడవలేని ఆ చిన్నారి మంచానికే పరిమితమైంది. గత నెల 6న తల్లి మంజుల అనారోగ్యంతో చనిపోయింది. ఈ క్రమంలో స్నేహను పెంచడం భారంగా భావించాడో ఏమో.. ఈ నెల 4న తెల్లవారుజామున నిద్రిస్తున్న బాలికను తండ్రి రాజు సూరారం సమీపంలోని దుందుభి వాగులో పడేశాడు. బుధవారం ఉదయం వాగులో చిన్నారి మృతదేహం తేలడంతో గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని