
విద్యుత్తు తీగలకు చిక్కుకున్నపతంగిని తీస్తుండగా...
ములుగు, న్యూస్టుడే: పండగ పూట ఆనందంగా ఎగరేసిన గాలిపటమే ఆ బాలుడి పాలిట మృత్యుపాశమైంది. ములుగు జిల్లా కేంద్రంలో శనివారం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన పాముల ఏసుబాబు, శాంతకుమారి దంపతులు ఇటుక బట్టీలో పని చేసేందుకు మూడేళ్ల క్రితం ములుగుకు వలస వచ్చారు. పండుగకు కొత్త బట్టలు కొనేందుకు శనివారం దంపతులిద్దరూ దుకాణానికి వెళ్లారు. గుడిసె వద్దే ఉన్న వారి కుమారుడు వెంకన్న (12) స్నేహితులతో కలిసి గాలిపటం ఎగురేశాడు. అది విద్యుత్తు స్తంభం తీగలకు చిక్కుకుంది. వెంకన్న స్తంభం ఎక్కి దాన్ని తప్పించే ప్రయత్నంలో తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. బాలుడు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి సరఫరా నిలిపివేయించారు. తరవాత బాలుడిని తాడు సాయంతో కిందకు దింపి ములుగు ప్రాంతీయ ఆసుపత్రికి, అనంతరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు.