ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్‌

మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రెండు ఎన్‌కౌంటర్లలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. చనిపోయిన మావోయిస్టుల్లో ఒకరు తెలంగాణ వాసి అని, మిగిలిన ముగ్గురు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం వారని పోలీసులు భావిస్తున్నారు...

Updated : 19 Jan 2022 04:35 IST

దంతెవాడ-సుక్మా జిల్లాల సరిహద్దులో మరొకటి
మొత్తం నలుగురు మావోయిస్టుల మృతి

వెంకటాపురం, దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రెండు ఎన్‌కౌంటర్లలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. చనిపోయిన మావోయిస్టుల్లో ఒకరు తెలంగాణ వాసి అని, మిగిలిన ముగ్గురు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం వారని పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం పామునూరు, జెల్లా సమీప కర్రిగుట్టల వద్ద ఒక ఎన్‌కౌంటర్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ- సుక్మా జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మరొకటి చోటుచేసుకుంది.

తాజా ఎన్‌కౌంటర్‌పై ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ కథనం ప్రకారం.. వెంకటాపురం మండలం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టులు పెద్ద ఎత్తున సమావేశమై ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, గుత్తేదారులను అపహరించి హతమార్చాలని పథక రచన చేస్తున్నట్లు సమాచారం అందింది. ఈ నెల 16న తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రత్యేక పోలీసు బలగాలు, సీఆర్పీఎఫ్‌ కర్రిగుట్ట ప్రాంతానికి వెళ్లి అడవుల్లో కూంబింగ్‌ చేపట్టాయి. మంగళవారం ఉదయం మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. అనంతరం పోలీసులకు మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్‌సాస్‌ రైఫిల్‌, సింగిల్‌బోర్‌ తుపాకులతో పాటు 10 రాకెట్‌ లాంఛర్లు, కిట్‌బ్యాగ్‌లను వారు స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల్లో గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ మధుకు గాయాలయ్యాయి.

పోలీసులు స్వాధీనం చేసుకున్న రాకెట్‌ లాంఛర్లు

మృతుల్లో ఏరియా కమిటీ కార్యదర్శి?
చనిపోయిన మావోయిస్టుల్లో వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత అలియాస్‌ మడకం సింగేగా ఉన్నట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈమె ప్రస్తుత జేఎండబ్ల్యూపీ డివిజన్‌ కమిటీ సభ్యుడు ముచ్చాకి ఉంగాల్‌ అలియాస్‌ సుధాకర్‌ భార్యగా తెలుస్తోంది. తక్కిన ఇద్దరిలో ఒకరు గుండాల-నర్సంపేట ఏరియా కమిటీ దళ కమాండర్‌ కొమ్ముల నరేశ్‌ అలియాస్‌ బక్కన్న అలియాస్‌ బుచ్చన్నగా అనుమానిస్తున్నారు. ఇతను జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల వాసి అని సమాచారం. మరో మృతుడు వెంకటాపురం ఏరియా కమిటీ దళ సభ్యుడిగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మృతుల వివరాలను పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మృతదేహాల తరలింపులో జాప్యం చోటుచేసుకుంది. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగలేదు.గాయాలైన కానిస్టేబుల్‌ మధును ప్రత్యేక హెలికాప్టర్‌లో సంఘటన ప్రాంతం నుంచి తొలుత వరంగల్‌కు అక్కణ్నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఛాతి భాగంతో పాటు కాలర్‌బోన్‌ మధ్యలో గాయమైంది.

దంతెవాడ- సుక్మా జిల్లాల సరిహద్దులో..
దంతెవాడ-సుక్మా జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందారు. ఆమె మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు మున్నీ(29) అని బస్తర్‌ రేంజీ ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు. మరికొందరు తప్పించుకున్నారన్నారు. .

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని