TS News: దుండగుల కళ్లలో కారం చల్లి.. భర్తను కాపాడుకున్న భార్య

ఆమె సాధారణ గృహిణి. తన భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి అపరకాళిలా తిరగబడింది. దుండగుల కళ్లలో కారం చల్లి మాంగల్యాన్ని కాపాడుకుంది. ఈ ఘటన వరంగల్‌ పట్టణంలోని శంభునిపేటలో చోటుచేసుకుంది.

Updated : 21 Jan 2022 07:47 IST

రంగశాయిపేట, న్యూస్‌టుడే: ఆమె సాధారణ గృహిణి. తన భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి అపరకాళిలా తిరగబడింది. దుండగుల కళ్లలో కారం చల్లి మాంగల్యాన్ని కాపాడుకుంది. ఈ ఘటన వరంగల్‌ పట్టణంలోని శంభునిపేటలో చోటుచేసుకుంది. స్థానికులు, సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ది వరంగల్‌ జిల్లా లారీ అసోసియేషన్‌’ అధ్యక్షుడు వేముల భూపాల్‌ ఇంటికి బుధవారం అర్ధరాత్రి ఆటోలో నలుగురు వ్యక్తులు వచ్చారు. వీరిలో ముగ్గురు భూపాల్‌ ఇంటిలోకి వెళ్లి ఆయనపై కత్తులతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు. వెంటనే భూపాల్‌ భార్య కల్యాణి అప్రమత్తమైంది. వంట గదిలోకి వెళ్లి కారం తీసుకొచ్చి దుండగుల కళ్లల్లో చల్లింది. కాపాడాలంటూ పెద్దగా కేకలు వేసింది. దీంతో నిందితులు ముగ్గురూ ఆటోలో పారిపోవడానికి ప్రయత్నించారు. అరుపులు విని భూపాల్‌ సోదరుడు క్రాంతికుమార్‌ అక్కడికి చేరుకున్నారు. కళ్లల్లో కారం ఎక్కువగా పడడంతో నిందితుల్లో ఒకరైన రంజిత్‌ వారికి చిక్కాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితుడిని అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. భూపాల్‌, క్రాంతి కుమార్‌ సోదరులతో ఉన్న భూతగాదాల వల్లే ప్రత్యర్థులు హత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని