పెళ్లి చేసుకొని అమెరికా తీసుకెళ్తానంటూ.. తెలుగు రాష్ట్రాల్లో యువతులకు వల

ఆన్‌లైన్‌ వివాహ పరిచయ వేదికలో పేరు నమోదుచేసుకున్న యువతులే అతని లక్ష్యం. ముందు ఛాటింగ్‌ చేస్తాడు..తర్వాత మాటలతో మాయచేస్తాడు. అమెరికాలో నీకూ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశపెట్టి అందినకాడికి దోచుకుని ముఖం చాటేస్తాడు. అలా తెలుగు రాష్ట్రాల్లో ఎందరినో మోసగించిన అతగాడి బండారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన ఓ యువతి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి వెల్లడించిన వివరాల ప్రకారం...

Updated : 05 Mar 2022 06:43 IST

డబ్బు తీసుకుని మాయం
యువతి ఫిర్యాదుతో  మోసగాడి లీలలు వెలుగులోకి

పెద్దపల్లి, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ వివాహ పరిచయ వేదికలో పేరు నమోదుచేసుకున్న యువతులే అతని లక్ష్యం. ముందు ఛాటింగ్‌ చేస్తాడు..తర్వాత మాటలతో మాయచేస్తాడు. అమెరికాలో నీకూ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశపెట్టి అందినకాడికి దోచుకుని ముఖం చాటేస్తాడు. అలా తెలుగు రాష్ట్రాల్లో ఎందరినో మోసగించిన అతగాడి బండారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన ఓ యువతి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి వెల్లడించిన వివరాల ప్రకారం...

సుల్తానాబాద్‌కు చెందిన యువతి వివాహ సంబంధాల కోసం 2020లో ఓ మ్యాట్రిమోనీలో పేరు నమోదుచేసుకున్నారు. ఖమ్మంకు చెందిన వాసిరెడ్డి రాహుల్‌ ఆమెతో ఛాటింగ్‌ చేశాడు. పరిచయం పెరిగాక పెళ్లి చేసుకుందామనే ప్రతిపాదన తెచ్చాడు. ఈ క్రమంలోనే తరచూ తన అవసరాలకు డబ్బులు తీసుకొని తిరిగి ఇచ్చేవాడు. కొన్నాళ్ల తర్వాత తనకు అమెరికాలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని, వీసా ఇతర ఖర్చులకు రూ.6 లక్షలు అవసరమని నమ్మించాడు. అమెరికా వెళ్లాక నీకూ అక్కడే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మరో రూ.7.5 లక్షలు నగదు తీసుకున్నాడు. ఆ క్రమంలో యువతి తన వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టుపెట్టి మరీ అతని అడిగిన మొత్తాన్ని ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత ఫోన్‌ ఎత్తకపోవడంతో తాను మోసపోయినట్టు గుర్తించిన యువతి సుల్తానాబాద్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూడు బృందాలతో హైదరాబాద్‌, ఖమ్మం, విజయవాడలలో గాలించి ఎట్టకేలకు నిందితుడు రాహుల్‌ను పట్టుకున్నామని’ ఏసీపీ తెలిపారు. నిందితుడు రాహుల్‌పై 2010లో ఖమ్మంలో, 2012లో హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో, 2013లో విజయవాడలో ఇదే తరహాలో కేసులు నమోదైనట్లు ఏసీపీ వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేటుగాడి బాధితులు అనేక మంది ఉన్నారన్నారు.

జల్సాల కోసం అడ్డదారులు

‘ఖమ్మం జిల్లా మధిర మండలం వెంకటాపురానికి చెందిన వాసిరెడ్డి రాహుల్‌ ప్రవర్తనతో విసిగిపోయిన తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే ఇంట్లోంచి గెంటివేశారు. అప్పట్నుంచి వాక్చాతుర్యంతో ఇతరులను మోసం చేయడంలో ఆరితేరాడు. తనకు ఆదాయపన్ను శాఖ నుంచి ఇబ్బందులుంటాయని కొందర్ని నమ్మించి, వారి పేరుతో లక్షల విలువైన గృహోపకరణలు, ఇతర ఖరీదైన వస్తువులను కొనుగోలుచేసేవాడు. రెండు, మూడు వాయిదాలు కట్టి కనిపించకుండా పోయేవాడు. అలా విజయవాడకు చెందిన బండారు భాగ్యలక్ష్మికి రూ.1.80 లక్షలు, షేక్‌ కలీల్‌కు రూ.4.86 లక్షలు, ఓ నాయకుడు వెంకటేష్‌కు రూ.1.20 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన ప్రసన్న లక్ష్మికి రూ.25 లక్షలు, ప్రకాశం జిల్లా వాసి కరీముల్లాకు రూ.1.45 లక్షలు, అదే జిల్లా వాసి బాచు అప్పన్నకు రూ.2.5 లక్షలు, ముప్పిరాజు మణికంఠకు రూ.2 లక్షల వరకు కుచ్చుటోపీ పెట్టాడు. ఆ వస్తువులను మార్కెట్‌లో తక్కువ ధరకు అమ్మేసి ఆ డబ్బుతో గోవా, హైదరాబాద్‌లలో జల్సాలు చేసేవాడని’’ ఏపీసీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని